Due to the heavy rains in Vijayawada more than 3 lakhs people reached to shelters: మునుపెన్నడూ లేని విధంగా విజయవాడ వరదలతో విలవిలలాడుతోంది. మొన్న కేరళ వాయినాడ్ ని తలదన్నేలా విజయవాడలో బుడమేరు నగరాన్ని ముంచెత్తింది. గత 50 సంవత్సరాలుగా ఇలాంటి వర్షాలు చూడలేదని నగరవాసులు చెబుతున్నారు. దారులన్నీ ఏరులైపోయాయి. నగరంలో ఎక్కడ చూసినా మోకాలిలోతు నీరే కనిపిస్తోంది. కనుచూపు మేరలో ఎక్కడా రోడ్లు కనిపించడం లేదు. ఇక ఇళ్లలోని నీరు వచ్చి చేరడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇంతటి భారీ వరదలకు కారణం అధికారుల అలసత్వమే అంటున్నారు. నగరానికి భారీ ఎత్తున వచ్చి పడుతున్న వరదకు వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తివేసి కిందకు నీరు వదలడం కారణంగానే ఇంతటి విపత్తు వచ్చి పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక వేళ వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోయివుంటే వరదనీరు ఎగువ ప్రాంతంలో ఉన్న నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టులోకి వరదనీరు చేరుకుంటే చాలా ప్రమాదమని భావించి అధికారులు జీ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.
ఆరడుగుల నీటి ప్రవాహం
పలు ప్రాంతాలలో కట్టలు తెగిపోయాయి. కండ్రిక, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్, పైపుల రోడ్డు ఇలా అది ఇది అని కాదు నగరం మొత్తం ప్రధాన మార్గాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఇళ్లలోనే దాదాపు ఐదు నుంచి ఆరడుగుల నీరు ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల ఇళ్లన్నీ పూర్తి నీటిలో మునిగిపోయి పైకి కూడా కనిపించనంత పరిస్థితి ఏర్పడింది. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని..ఏనాడూ ఇంతటి విలయం చూడలేదని నగర వాసులు వాపోతున్నారు. బుడమేరు వరద నగరం చుట్టుపక్కల ఉన్న లోతట్ు ప్రాంతాలకు ప్రవేశించడంతో లక్షల సంఖ్యలో ప్రజలు నిర్వాసితులు అయ్యారు. కట్టుబట్టలతో ఇళ్ల పైకెక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. అన్నమూ రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు. కరెంట్ లేక, సెల్ ఫోన్లు పనిచేయక తమ బంధువులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియక అలమటిస్తున్నారు. అయితే ఏపీ సర్కార్ తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఆదివారం అంతా చంద్రబాబు కలెక్టరేట్ కార్యాలయంలో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ప్రభుత్వ అధికారులకు ఆదివారం సెలవు రద్దు చేసి సహాయక చర్యలలో పాల్గొనాల్సిందిగా కోరారు.
మూడు లక్షల మంది నిరాశ్రయులు
ఇప్పటిదాకా మూడు లక్షల మంది విజయవాడ ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారందరికీ సహాయక షెల్టర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయవాడలోని ప్రైవేటు హోటళ్ల యజమానులతో చంద్రబాబు మాట్లాడి నిర్వాసితులకు తాత్కాలిక పునరావాసం కల్పించారు. అన్ని పునరావాస కేంద్రాలలో హెల్పింగ్ నంబర్లు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్న క్యాంటీన్లన్నీ ఉచితంగా ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు పలకరిస్తే చాలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ ఇంటి అమూల్యమైన సామానులు నీట మునిగిపోయాయని..తిరిగి తాము కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని ఓ మధ్యతరగతి ప్రైవేటు ఉద్యోగి వాపోయాడు. దూర ప్రాంతంలో తమ బంధువులు ఎంతో ఆందోళన చెందుతున్నారని..వారిని తాము సురక్షితంగా ఉన్నామనే సమాచారం సైతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని..దగ్గరలో ఉన్న బంధువులను కూడా కలుసుకోలేని పరిస్థితి ఏర్పడిందని..వారంతా ఎక్కడ ఎలా తలదాచుకున్నారో అర్థం కావడం లేదని మరో మహిళ ఆందోళన వ్యక్తం చేస్తోంది. హెలికాప్టర్లు, మర బోటులు అధికారులు సిద్ధం చేశారు. ఇంకా జలదిగ్బంధంలో ఇరుక్కున్నవారిని సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తున్నారు.