Dokka Manikya Vara Prasad:దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ అనంత్ బాబు, దువ్వాడ శ్రీనివాస్లను వైసీపీ నుంచి బహిష్కరించాలని సూచించారు. జగన్ నైతిక ధైర్యంతో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే వివాదాస్పద నాయకులపై తప్పని సరిగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మహిళల్లో చాలా మంది రాజకీయ నేతల బాధితులుగానే మిగిలిపోతున్నారని తెలిపారు. అందుకే పార్టీలు అటువంటి నేతలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా స్పందించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటును వైసీపీ గెలుస్తుందన్న వైవీ సుబ్బారెడ్డి.. కుటుంబ కలహాలకు ఎన్నికలకు సంబంధం ఉండదని అన్నారు.
Also Read: రివర్స్ గేర్లో దూసుకుపోతున్న వైసీపీ.. అయోమయంలో జగన్
దువ్వాడ వివాదంపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కూడా స్పందించారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనావాస్ వ్యవహారం పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం అని అన్నారు. ఆయనను తాము ఎక్కడా విమర్శించడం లేదని తెలిపారు. తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ ముఖ్య నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. కావాలనే కొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని స్పష్టం చేశారు.