Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి, దివ్వెల మాధురి మధ్య పతాకస్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగాయి. తన భర్తను మోసం చేసి, బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకుంటున్నదని వాణి ఆరోపించగా.. ఆయనేమీ చిన్న పిల్లాడు కాదని మాధురి బదులిచ్చింది. అవాస్తవ ఆరోపణలతో తన కుటుంబంలో చిచ్చు పెట్టిందని వాణిపై విరుచుకుపడింది. దువ్వాడ శ్రీనివాస్ అక్రమంగా మాధురితో కలిసి ఉంటున్నాడని వాణి ఆరోపించింది. దువ్వాడ శ్రీనివాస్తో తాను ఒక ఫ్రెండ్గా మాత్రమే కలిసి ఉంటున్నానని, రహస్య మిత్రుడేమీ కాదని మాధురి ఆ ఆరోపణలు కొట్టిపారేసింది.
దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు వాణి ధర్నా చేస్తున్నట్టే తాను కూడా ధర్నా చేయగలనని మాధురి పేర్కొంది. అందుకోసం ఆమె ఈ రోజు కారులో బయల్దేరుతుండగా.. ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ఢీకొన్న మాధురి గాయాలపాలైంది. ఆమెను పలాస హాస్పిటల్ తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మరో హాస్పిటల్ తరలించారు. వాణి చేసిన ఆరోపణలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అందుకే కావాలనే కారును ఢీకొట్టినట్టు తెలిపారు.
Also Read: Duvvada Srinivas: రోడ్డు ప్రమాదంలో మాధురికి గాయాలు.. ‘ఇది ప్రమాదం కాదు.. చికిత్స వద్దు’
ఇదిలా ఉండగా.. ఆమె ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కూడా ఓ విజ్ఞప్తి చేశారు. ఆడపిల్లలకు కష్టం వస్తే అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారని, తాను ఇప్పుడు కష్టాల్లో ఉన్నానని, తనకు పవన్ కళ్యాణ్ అండగా నిలవాలని కోరారు. వాణి చేసిన ఆరోపణలతో తన పిల్లలు స్కూల్లో, ట్యూషన్ సెంటర్లో అనేక ప్రశ్నలను ఎదుర్కొంటున్నారని మాధురి తెలిపారు. వారు నాకు ఫోన్ చేసి ఈ విషయం చెబితే చాలా బాధేసిందని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారని, లారీని ఢీకొట్టాలని అనుకున్నానని, కానీ, కారును ఢీకొట్టానని వివరించారు. తన పిల్లలు, తనపై వాణి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు యాక్షన్ తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.