విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విచారణకు స్పీడ్ పెంచిన అధికార యంత్రాంగం కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ, అగ్నిమాపక, మత్స్యశాఖ, ఫోరెన్సిక్, పోలీస్శాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. అలాగే క్రైమ్, సీసీఎస్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి రెండ్రోజుల్లో నివేదిక అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఫిషింగ్ హార్బర్ ప్రమాద ఘటనకు కారకుడు యూట్యూబర్ లోకల్ బాయ్ నానేనంటూ అనుమానం వ్యక్తి చేశారు. దీంతో నానికి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అయితే.. తమ దర్యాప్తులో ఈ ప్రమాద ఘటనకు లోకల్ బాయ్కి ఏ సంబంధం లేదని పోలీసులు నిర్థారించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో నాని ఓ హోటల్లో పార్టీ చేసుకుని బయటకు వస్తున్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్కావడంతో.. ఆ దృశ్యాల ఆధారంగా నానికి సంబంధం లేదని చెబుతున్నట్టు సమాచారం. మత్స్యకారులకు కన్నీళ్లు పెట్టించిన ఘటనపై కూపీ లాగుతున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మంగళవారం ఘటనాస్థలాన్ని పలువురు పార్టీ నేతలు పరిశీలించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి, జీవీయల్, గంటా, కొల్లు రవీంద్రలు ప్రమాదంపై ఆరా తీయనున్నారు. ఇక ఇప్పటికే విశాఖ అగ్నిప్రమాదం ఘటనపై స్పందించిన సీఎం జగన్ నష్టపరిహాన్ని ప్రకటించారు. ప్రమాదంలో కాలి బూడిదైన పడవలకు 80 శాతం పరిహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
ఆదివారం అర్థరాత్రి మత్స్యకారులు ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 50కిపైగా బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో సుమారు 40 కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని చెబుతున్నారు మత్స్యకారులు. తమకు ఉపాధినిచ్చే పడవలు కళ్ల ముందే కాలి బూడిదవుతుంటే కన్నీళ్లు పెడుతూ విలవిలలాడిపోయారు గంగపుత్రులు. మద్యం మత్తులో ఆకతాయిల పనేనని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అనుమానించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే.. నానికి.. ప్రమాదానికి ఏ సంబంధం లేదని పోలీసులు తేల్చినట్టు సమాచారం.