శ్రీవారి దర్శనానికి నడక మార్గంలో వెళ్లే భక్తులకు ఇక చేతికర్ర మస్ట్ కానుంది. ఇప్పటి వరకు ప్రకటనలకే పరిమితమైన చేతికర్రల అంశాన్ని అమల్లోకి తీసుకొచ్చింది టీటీడీ. అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు ఇప్పటికే చేతికర్రలను అందిస్తున్నారు టీటీడీ అధికారులు. అయితే ఇక్కడితో తమ బాధ్యత అయిపోలేదంటున్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
తిరుమలలో నడకదారి భక్తులకు రక్షణగా టీటీడీ చేతికర్రలు అందించింది. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులకు కర్రలు అందించారు. అటవీశాఖ అధికారులు చేసిన సూచన మేరకే నడకదారి భక్తులకు చేతి కర్రలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కావాలనుకున్న వారికే కర్రలను పంపిణీ చేస్తున్నామని నడిచి వెళ్లే యాత్రికులకు అండగా ఉంటామని తెలిపారు.
గుంపులు గుంపులుగా ప్రయాణించాలని.. ప్రతీ ఒక్కరిలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు కర్రలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. చేతి కర్రలు చేతులు దులుపుకొనే ప్రక్రియ కాదని.. మెట్ల మార్గంలో టీటీడీ భద్రతా సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. చేతి కర్ర ఒక్కటే ఇచ్చి మా పని అయిపోయింది అనుకోవడం లేదని… విమర్శలను.. అవి చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు కరుణాకర్రెడ్డి.
అలిపిరి మెట్ల మార్గంలో ప్రస్తుతం పదివేల కర్రలు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. మరో పదివేల కర్రలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.. వీటికోసం కేవలం 45 వేలు ఖర్చయిందని, భక్తులకు రక్షణ చర్యల్లో భాగంగానే చేతి కర్రలు అందిస్తున్నామన్నారు. భక్తులకు అలిపిరి మెట్ల మార్గంలో ఇచ్చిన చేతి కర్రలను ఏడవ మైలు నరసింహస్వామి ఆలయం వద్ద తిరిగి తీసుకుంటామని తెలిపారు.
తిరుమల అలిపిరి నడకమార్గంలో ఇటీవల చిన్నారి లక్షితపై చిరుత దాడి చంపడం రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. ఈ ఘటన తర్వాత భక్తుల భద్రతపై అనేక సందేహాలు రేకెత్తాయి. భక్తుల భద్రతను టీటీడీ గాలికొదిలేసిందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో టీటీడీ బోర్డు అనేక చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇందులో భాగంగా భక్తుల రక్షణ కోసం అనేక చర్యలు కూడా చేపట్టింది. నడకమార్గాల్లో భక్తులను గుంపులుగా పంపడంతోపాటు వారికి రక్షణగా సెక్యూరిటీ గార్డులను సైతం ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2గంటల దాటిన తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను మెట్ల మార్గంలో అనుమతించరు. వీటితోపాటు భక్తుల భద్రత కోస నడకదారిలో వెళ్లే భక్తులకు చేతికర్రలు ఇవ్వాలని కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది.
అయితే కర్రలు ఎప్పుడు ఇస్తామన్నదానిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని టీటీడీ… సడెన్గా కర్రల పంపిణీ అమల్లోకి తెచ్చింది. ఇకపై అలిపిరి నడక మార్గం నుంచి తిరుమలకు వెళ్లే ప్రతి ఒక్క భక్తుడి చేతిలో చేతికర్ర ఉండనుంది. అయితే ఈ చేతికర్రల అంశం మొదటి నుంచి వివాదస్పదంగానే ఉంది. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. కర్రలతో చిరుతలను కట్టడి చేయడం సాధ్యమేనా అనే చర్చ జరిగింది. ఇంకా జరుగుతోంది. చిరుత దాడి చేసేప్పుడు కర్రలతో ఎలా ఆపుతారంటూ ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఓ క్రూరమృగం ఎదురైతే కర్రలతో వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎంతమందికి ఉంటుందని ప్రశ్నలు వచ్చాయి. ఇక ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ అంశంపై తీవ్రంగానే స్పందించాయి.
ఇక చేతికర్రల అంశంపై సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది. చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు.. చేస్తున్నారు. భక్తుడి చేతిలో కర్రను చూసి చిరుత నాలుగడుగులు వెనక్కి వేస్తుందని కొందరు.. కొన్నాళ్లు పోతే కరాటే వచ్చిన వాళ్లని మాత్రమే అనుమతిస్తారేమో అంటూ మరికొందరు ట్రోల్స్ చేశారు. ఇలా రకరకాలుగా ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి.
అయితే దీనిపై టీటీడీ కూడా స్పందించింది. భక్తుల రక్షణ కోసం చేతికి కర్రలు ఇవ్వాలని నిర్ణయించడం తప్పవుతుందా? భక్తులకు కర్రలు కాకుండా తుపాకులివ్వాలా? అని ప్రశ్నిస్తున్నారు అధికారులు. అయినా కర్రని తేలిగ్గా తీసేయాల్సిన పనిలేదని చెబుతున్నారు. గ్రామాల్లో ఒంటరిగా పొలానికెళ్లే రైతు చేతిలో కర్ర వుంటుంది. ఆ సమయానికి ఆ చేతికర్రే రైతుకు తోడు రక్షణ. అటవీ ప్రాంతాల్లో సంచరించే గిరివాసులకు కర్రే బలమైన ఆయుధమని చెబుతున్నారు. మనిషి చేతిలో కర్రను చూస్తే ఏ జంతువైనా భయపడుతుందన్నది టీటీడీ చెబుతున్న మాట.
అంతేకాదు భక్తులకు చేతి కర్ర ఇచ్చి బాధ్యతల నుంచి తప్పించుకోమని చెబుతున్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని.. అందుకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు భద్రత ఏర్పాట్లు కొనసాగిస్తూనే నడక మార్గంలో సంచరించే చిరుతలను బంధించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. ఇప్పటి వరకు నాలుగు చిరుతలను బంధించారు. వాటిలో ఒక దాన్ని అడవిలో, మిగిలిన మూడింటిని తిరుపతి ఎస్వీ జూలో వదిలిపెట్టారు. అయితే మరో చిరుత అటవీప్రాంతంలో తిరుగుతున్నట్టు ఇటీవల తేలింది. దాన్ని కూడా బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.