Tirumala : తిరుమలలో చిరుతలు భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కాలి నడక మార్గంలో కొండపై వెళ్తున్న భక్తులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుంటున్నారు. ఏడు కొండల వాడిని మదిలో తల్చుకుంటూ కొండ ఎక్కాల్సిన భక్తులు ఎప్పుడేం జరుగుతుందోనని భయపడాల్సి వస్తోంది. ఇప్పటికే ఓ బాలుడు చిరుత దాడికి గురై తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఓ చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. కానీ చిన్నారులపై దాడి చేసిన చిరుత ఇదేనా? కాదా? అనే క్లారిటీ లేదు. ఒకవేళ దాడి చేసింది ఇదే చిరుత అని తేలితే… మ్యాన్ ఈటర్ అని నిర్ధారణ అయితే.. బయటకు వదిలే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నడకదారికి సమీపంలో చిరుతలు, పులులు, ఇతర మృగాలు భక్తులపై దాడి చేసే ప్రమాదం ఉంది. ఇటీవలి ఘటనలతో ఈ విషయం నిర్ధారణ అయింది. టీటీడీ భక్తుల భద్రతను గాలికి వదిలేసిందని విమర్శలు వచ్చాయి. క్రూరమృగాలు తిరిగే ప్రదేశం మీదుగా నడక ప్రయాణం సాగించే వారి ప్రాణాలంటే టీటీడీకి లెక్కలేకుండా పోయిందని భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. వ్యతిరేకత పెరగడాన్ని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ పెద్దల నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. నడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నపిల్లల్ని అనుమతించకుండా ఆంక్షలు అమల్లో తెచ్చారు. ఇది కూడా సమస్యకు పరిష్కారం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం చిరుతలు చిన్న పిల్లలపై దాడి చేస్తున్నాయి. కాబట్టి చీకటి పడితే చిన్నపిలలను నడక మార్గంలో అనుమతించబోమని టీటీడీ పెద్దలు చెబుతున్నారు. అదే గొప్ప పరిష్కారమని అనుకుంటున్నారు. రేపెప్పుడైనా పెద్దవాళ్లపైనా చిరుతలు దాడికి పాల్పడితే నడక మార్గంలో పెద్దలను కూడా అనుమతించరా…? చిరుతలు దాడి చేయడానికి ఏదైనా నిర్ధిష్టమైన సమయం ఉంటుందా…? ఎప్పుడైనా దాడికి పాల్పడితే ఎలా…? దాడికి పాల్పడకుండా చేయడం ఎలా…? అనే ప్రశ్నలు చాలామంది నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఎన్ని ప్రశ్నలకు టీటీడీ ఆన్సర్ చెప్పింది… అవేంటి…? అంటే ఏమీ లేవు. వాళ్లేదో చెప్పి… అదే గొప్ప పరిష్కారం అని ఎలా నమ్మడం..? భక్తుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారితే ఎవరు బాధ్యులు?
ఇప్పటికే టీటీడీ పెద్దలు చెబుతున్న పరిష్కారాలు తూతూమంత్రంగా ఉన్నాయి. టీటీడీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జిల్లా యంత్రాంగం, అటవీశాఖ అధికారుల ఇంతమంది కలిసి భక్తులకు భద్రత కల్పించకపోవడం సంగతి పక్కన పెడితే.. అసలు ఇదీ పరిష్కారం అని ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇప్పటికి సూచిస్తున్న పరిష్కారాలే నవ్వులపాలు అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా కర్రలు పట్టుకుని కొండ ఎక్కాలంటూ అధికారులు చెబుతున్నారు. ఈ కర్రలకు పులులు బెదురుతాయా..? బెదిరితే మృగాలు పారిపోతాయి… లేదంటే భక్తుల ప్రాణాలు పోతాయి.
మెట్ల మార్గానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ద్వారా క్రృూర మృగాలు భక్తులపై దాడి చేయకుండా పరిష్కారం చూపవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. కానీ చట్టాలు, నిబంధనల మూస చట్రంలో పడి అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజల కోసం చట్టాలా… చట్టాల కోసం ప్రజలా…? ఆలోచించుకోవాల్సిన అవసరముంది. ప్రస్తుతానికి అధికారులు ఇస్తున్న కర్రలతో పెద్దగా ఉపయోగం లేదు. కానీ.. ప్రస్తుతానికి మన టీటీడీ పెద్దల ఆలోచనలో… సుధీర్ఘ సమీక్షల్లో… మేధోమథనంలో ఉద్భవించిన గొప్ప పరిష్కారం ఇదే కాబట్టి… అంతకంటే వేరే పరిష్కారం కనబడటం లేదు కాబట్టి… ఆ కర్రలే భక్తుల చేతుల్లో సుదర్శన చక్రాలు… అవే భక్తుల ప్రాణాలకు కొండంత అండ. ఆపై…. క్రూర మృగాల కనికరం… ఏడు కొండల వాడి దయ.