Minister Roja : అభ్యర్ధుల మార్పులు చేర్పులుపై వైసీపీ అధినేత పెద్ద కసరత్తే చేస్తున్నారు.. సన్నిహితులు , సొంత మనుషులు అని లేకుండా.. గెలవడం కష్టం అని భావించే అందర్నీ పక్కన పెట్టేస్తున్నారు. టికెట్ల కేటాయింపు, అభ్యర్థిత్వాల విషయంలో ఎవరైనా సరే.. డోంట్ కేర్.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
Minister Roja : అభ్యర్ధుల మార్పులు చేర్పులుపై వైసీపీ అధినేత పెద్ద కసరత్తే చేస్తున్నారు.. సన్నిహితులు , సొంత మనుషులు అని లేకుండా.. గెలవడం కష్టం అని భావించే అందర్నీ పక్కన పెట్టేస్తున్నారు. టికెట్ల కేటాయింపు, అభ్యర్థిత్వాల విషయంలో ఎవరైనా సరే.. డోంట్ కేర్.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
తమ కుటుంబానికి ఎంతో దగ్గరి వ్యక్తిగా పేరున్నప్పటికీ కూడా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కూడా ఆయన కాదనుకున్నారు. అలాంటి జగన్ మంత్రి రోజా విషయంలో సాఫ్ట్ కార్నర్తో ఉన్నారన్న ప్రచారం జరిగింది.. నగరి వైసీపీలో ఆమెపై వ్యతిరేకత పీక్ స్టేజ్కి చేరుతుండటంతో ఇప్పుడు ఆయన మనసు మార్చుకుంటారా? .. రోజాను నగరికి దూరం చేస్తారా?
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి రోజా పొలిటికల్ ఫ్యూచర్పై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.. వైసీపీలో అభ్యర్థుల మార్పు చేర్పులు ప్రారంభం అయిన నాటినుంచి రోజాకు ఈసారి టికెట్ దక్కబోదనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.. రోజాపై నగరి నియోజకవర్గం వైసీపీలో విపరీతమైన అసంతృప్తి ఉంది.. స్థానికంగా పట్టున్న మూడు, నాలుగు గ్రూపులు రోజాకి వ్యతిరేకంగా పావులు కదుపుతూ.. ఈ సారి ఆమెకు టికెట్ ఇస్తే ఓడిస్తామని.. పార్టీ పెద్దలకు అల్టిమేటం ఇస్తున్నాయి.
సినిమా హీరోయిన్గా పాపులర్ అయి, తర్వాత పెళ్లి చేసుకుని రోజా సెల్వమణిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ మంత్రిగారి అసలు పేరు శ్రీలతా రెడ్డి అని చాలా మందికి తెలియదు. చిత్తూరు జిల్లాలోనే పుట్టినా హైదరాబాద్లో సెటిలైన రోజారెడ్డి 2002లో తమిళ దర్శకుడు సెల్వమణిని పెళ్లిచేసుకుని రోజా సెల్వమణి అయ్యారు. టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2004, 2009 ఎన్నికల్లో నగరి, చంద్రగిరిల నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తర్వాత కాంగ్రెస్ చేరి వైసీపీకి షిప్ట్ అయ్యారు.
వైసీపీలో చేరాకే ఆమె పొలిటికల్ కెరీర్ గాడిలో పడింది.. 2014 ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి టీడీపీ దిగ్గజం గాలి ముద్దుకృమనాయుడ్ని ఓడించి.. తొలి సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.. 2019లో దివంగత ముద్దుకృష్ణమనాయుడి కుమారుడు భానుపై గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. నోటికి పని చెప్పడంలో దిట్ట అయిన ఆ ఫైర్బ్రాండ్ నేత మొదటి సారి గెలిచింది తక్కువ ఓట్ల తేడాతోనే.. ఇక 2019లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా రోజా గట్టెక్కింది 2,708 మెజార్టీతోనే కావడం గమనార్హం. ఇప్పుడా లెక్కల్నే ఫోకస్ చేస్తున్నారు రోజా వ్యతిరేకులు.
హైదరాబాద్లో స్థిరపడి.. నగరి ఎమ్మెల్యే అయిన రోజా రెండో సారి గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలోని పలువురు నేతలతో సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గంలోని అసమ్మతి వర్గం అంతా ఏకమై రోజాకు వ్యతిరేకంగా అమరావతిలో కూర్చొని పావులు కదుపుతున్నారట.. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆమెకు రాజకీయవైరం ఉంది.
ఆ క్రమంలో నగరి వైసీపీలో రోజాపై వ్యతిరేకత పెరిగిపోతోందంట.. రెండో సారి గెలిచినప్పటి నుంచి ఆమె వ్యవహరిస్తున్న తీరు నచ్చక వ్యతిరేకిస్తున్న వారందరూ ఈ సారి రోజాకు టికెట్ దక్కకుండా తాడేపల్లిలో పెత్త ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారంట. అదీకాక ప్రస్తుతం అభ్యర్థిత్వాల మార్పు చేర్పుల విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా కీలకంగా చక్రం తిప్పుతున్నారు. ఇలాంటి సమయంలో రోజాకు ఇక టికెట్ దక్కదనే ప్రచారాన్ని వ్యతిరేకులు ప్రారంభించారు.
రోజా మాత్రం ఈ ప్రచారంపై పలు సందర్భాల్లో ఆచితూచి స్పందించారు.. జగనన్న ఎలా ఆదేశిస్తే అలా చేస్తానని.. టికెట్ దక్కేది లేనిది జగన్ నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు.. అయితే వ్యతిరేకతను తోసిరాజని రోజా పట్ల జగన్ కొంత సానుభూతితో ఉన్నారని, ఆమెకు టికెట్ కొనసాగించే ఉద్దేశం ఉందని ఆ మధ్య తాడేపల్లి వర్గాల నుంచి వినిపించింది. అభ్యర్థుల మార్పుచేర్పుల విషయంలో మూడో జాబితాలోనే శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించాలనుకున్నారంట.. అయితే రోజా పట్ల సానుకూల ధోరణితోనే జగన్ ఆమెను మార్చలేదని వినిపించింది. ఒకరకంగా రోజా పట్ల జగన్ సానుభూతితో ఉన్నారని పార్టీ వర్గాలు అప్పట్లో చెప్పుకొచ్చాయి.
అయితే రోజాకు దాదాపు నగరి నియోజకవర్గ పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో ఉన్న సొంత పార్టీ నాయకులతో విభేదాలు ఉన్నాయి. ఆమె ఒంటెత్తు పోకడలు అనుసరిస్తోందన్నది వారి వాదన. జగన్ స్వయంగా రోజాను తీవ్రంగా విభేదించే నగరి వైసీపీ నేత కేజే శాంతి , రోజాచేతులు కలిపి.. కలిసి పనిచేయాలని చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందంటే రోజాపై ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది.. అంతగా రోజాను ద్వేషిస్తున్న వారంతా ఇప్పుడు స్వరం పెంచుతున్నారు.. ఆమెకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటున్నారు. వీరిలో కొందరు కీలక నాయకుల వెనుక మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలం కూడా ఉందరి ప్రచారం జరుగుతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో రోజాకు టికెట్ సందేహమే అంటున్నారు.. అదే జరిగితే రోజా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.