Vyuham Updates : గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందడి చేస్తున్నారు. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ క్లాప్ కొడుతుండగా రెండు రోజులుగా మూవీ చిత్రీకరణలో బిజీ అయ్యారు. అయితే ఇదంతా నిజమనుకుంటే సినిమాలో కాలేసినట్లే. రామ్గోపాల్ వర్మ సినిమా ఎఫెక్ట్లోని మేటర్ ఇదన్నమాట. RGV రూపొందిస్తున్న వ్యూహం సినిమా షూటింగ్ శరవేంగా జరుగుతోంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ దీక్ష చేయడం.. సీఎంగా ప్రమాణ స్వీకారం తదితర ఘట్టాలపై సినిమా చిత్రీకరణ జరుగుతోంది.
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్లో బుధవారం వ్యూహం మూవీ షూటింగ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సన్నివేశాలను
రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో షూట్ చేశారు. యాక్షన్, కట్ చెబుతుండగా హీరో సేమ్ టు సేమ్ జగన్ హావభావాలు పలికించారు. రియల్ సీన్కు రీల్ సీన్కు ఏమాత్రం తేడా ఉండకుండా డైరెక్టర్ RGV సూచనలు ఇస్తున్నారు.
బుధవారం ఉదయం ముఖ్యమంత్రిగా YS జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చిత్రీకరించారు. ఆ తర్వాత మధ్యాహ్నం ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్ష నిర్వహించిన సన్నివేషాలను షూట్ చేశారు. గుంటూరు దీక్షలో ఆరోగ్య పరిస్థితి విషమించటంతో పోలీసులు జగన్ అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘట్టాన్ని కూడా చిత్రీకరించారు.
గురువారం కొల్లిపర, తెనాలి ప్రాంతాల్లో చిత్రానికి సంబంధించిన పాటలను చిత్రీకరిస్తున్నారు. జగన్ అప్పట్లో కొల్లిపరలో ఓదార్పు యాత్ర చేశారు. ఆ సీన్స్ షూటింగ్ కోసం కొల్లిపరను ఎంచుకున్నారు. జగన్ పాదయాత్ర చేస్తుండగా వైసీపీ శ్రేణులు వెన్నంటి నడుస్తున్నారు. ఈ సీన్ను చూసి స్థానికులు మళ్లీ జగన్ వచ్చారా? అని ఆశ్చర్యపోతున్నారు. వ్యూహం సినిమాలో YS జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం నుంచి.. అధికారం చేపట్టే వరకు ప్రధాన ఘట్టాలను కవర్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పనులకు సంబంధించిన అంశాలు కూడా వ్యూహం మూవీలో ఉండనున్నాయని సినిమా వర్గాలు చెప్పాయి.
షూటింగ్ ఏరియాలో వైసీపీ పార్టీ నేతలే తరలివచ్చారా అనేలా సెట్ను క్రియేట్ చేశారు. జనం కూడా ఈ సందడి చూసి నిజంగా జగన్ వచ్చారా? అని డౌట్ పడ్డారు. ఆ తర్వాత షూటింగ్ జరుగుతుందని తెలిసి హ్యాపీగా ఫీలయ్యారు. రియల్ హీరో అయినా రీల్ హీరో అయినా.. తమ ప్రాంతంలో షూటింగ్ జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు స్థానికులు.. జగన్ను నేరుగా చూస్తున్నట్లుందని హర్షం ప్రకటించారు.