AP Highcourt New Chief Justice(AP latest news) : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. ధీరజ్ సింగ్ చేత సీజేగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు.
జమ్మూకశ్మీర్ కు చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఇంతకుముందు బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా బాధ్యతలు చేపట్టారు. ధీరజ్సింగ్ ఠాకూర్ 1964 ఏప్రిల్ 25న జన్మించారు. ఢిల్లీ, జమ్మూకశ్మీర్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా 1989 అక్టోబర్ 18న పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా 2013 మార్చి 8న బాధ్యతలు చేపట్టారు. 2022 జూన్ 10న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి అక్కడే సేవలు అందించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ తమ్ముడే జస్టిస్ ధీరజ్ సింగ్.
గురువారమే విజయవాడ చేరుకున్న ధీరజ్ సింగ్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు ఆవరణలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ స్వీకరించారు.