Kanaka Durgamma Temple: అమ్మా దుర్గమ్మ తల్లీ.. శరణు శరణు అంటూ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం కొరకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. దసరా పండుగ వచ్చిందా చాలు.. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాక.. యావత్ భారతదేశం నుండి అమ్మవారి భక్తులు ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం కోసం వస్తారు. గతంలో అమ్మవారికి కోరికలు విన్నవించుకున్న భక్తులు.. తల్లీ అంతా నీ దయ తల్లీ అంటూ.. కానుకలను సమర్పిస్తారు. అమ్మవారికి నిశ్చలమైన భక్తితో మొక్కుకుంటే చాలు.. అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కోరికలు తీరుస్తుందని భక్తుల విశ్వాసం.
అందుకే ఈసారి దసరా పండుగను పురస్కరించుకొని ఓ భక్తుడు అమ్మవారికి ఏకంగా బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఈ కిరీటం ధర, ఆ భక్తుడు సమర్పించిన బంగారం ధర మొత్తం కలిపి ఏకంగా అక్షరాలా రూ. 3.5 కోట్ల రూపాయలు. ఆ భక్తుడు ఎవరో కాదు ముంబాయికి చెందిన వ్యాపారవేత్త సౌరభ్ గౌర్.
ముంబాయికి చెందిన వ్యాపారవేత్త సౌరభ్ గౌర్ .. ఇంద్రకీలాద్రి అమ్మవారి భక్తులు. అయితే ఈ సారి దసరాకు అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఆలయాలకు బంగారు కిరీటాలు తయారు చేయడంలో నిష్ణాతులైన హైదరాబాద్ కి చెందిన గుణ డైమండ్ వారిని సంప్రదించారు. ఇప్పటికే కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ శ్రీనివాసుడికి బంగారు కిరీటాన్ని తయారు చేసిన అనుభవం గల గుణ వారు అంగీకరించారు.
కాగా దసరా శరన్నవరాత్రుల ప్రారంభం నాటికి కిరీటం తయారీ పూర్తి చేయాలని భావించిన వారు.. 80 సిబ్బందితో 40 రోజుల పాటు శ్రమించి.. చూడచక్కని కిరీటాన్ని తయారు చేశారు. ఈ కిరీటంకు 9 లేయర్స్ ఉండగా.. ఒక్కొక్క లేయర్ ను చూసినా చాలు కదా.. అనే అనుభూతి కలగాల్సిందే. ఎటు చూసినా కిరీటంలో వజ్ర వైడూర్యాలు, కెంపులు, రూబీలు, మనకు కనిపిస్తాయి. ఈ కిరీటం తయారీకై 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్ 1.4 కేజీలు ఉపయోగించినట్లు, అలాగే 120 క్యారెట్ల వజ్రాలను కిరీటంలో పొందుపరిచినట్లు తయారీదారులు తెలిపారు.
ఈ కిరీటం తయారు చేసే అవకాశం రావడం తమకు దక్కిన భాగంగా గుణ డైమండ్స్ యాజమాన్యం ప్రకటించింది. ఈ కిరీటం తయారీకి ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు తగిన సూచనలు, సలహాలు అందించారని , కిరీటం అమ్మవారికి ధరింపజేసిన సమయంలో.. అమ్మవారి రూపంతో కిరీటం మిలమిల మెరిసి పోతుందన్నారు. అలాగే దసరా శరన్నవరాత్రులలో పాల్గొనేందుకు కిరీటం సమర్పించిన దాత సౌరభ్ గౌర్ తన కుటుంబంతో కలిసి అమ్మవారిని దర్శించుకోనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అచంచలమైన భక్తితో అమ్మవారిని కోరుకుంటే చాలు.. ఆ అమ్మ దీవెనలు అందుతాయని, అందుకే తన మొక్కు చెల్లించి .. భక్తితత్వాన్ని చాటి చెప్పినట్లు సౌరభ్ గౌర్ తెలిపారు.