Pawan kalyan latest political news(Andhra news updates): ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్.. మంగళగిరి పార్టీ కార్యాలయంలో యాగం చేస్తున్నారు. ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధిని కాంక్షిస్తూ జనసేన అధ్యక్షులు ఈ యాగానికి పూనుకున్నారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించి యాగశాలకు వచ్చారు పవన్. యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టించారు. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ యాగం.. మంగళవారం కూడా కొనసాగనుంది.
మరోవైపు, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి భూమి పూజ చేశారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఇప్పటి వరకూ హైదరాబాద్ నుంచి సాగుతున్న జనసేన కార్యకలాపాలు.. ఇకపై మంగళగిరి నుంచే కొనసాగించాలని జనసేనాని నిర్ణయించారు. అందులో భాగంగానే కేంద్ర కార్యాలయ భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
అటు, మంగళవారం సాయంత్రం అన్నవరం బయల్దేరి వెళ్తారాయన. బుధవారం సత్యదేవునికి ప్రత్యేక పూజలు చేసి వారాహిని అధిరోహిస్తారు. మొదటి విడత యాత్రలో 11 నియోజకవర్గాల్లో పవన్ పర్యటన సాగుతుంది. ఏడు బహిరంగ సభలకు జనసైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు. ఈనెల 14న కత్తిపూడి హైవే దగ్గర తొలి బహిరంగ సభ ఉంటుంది. 16న పిఠాపురం, 18న కాకినాడ, 20న ముమ్మిడివరం, 21న అమలాపురంలలో సభలు నిర్వహిస్తారు. 22న మల్కీపురం, 23న నరసాపురంలో బహిరంగ సభలు నిర్వహించాలని జనసేన నిర్ణయించింది.