TDP: అతడు ఏపీ డిప్యూటీ సీఎం కొడుకు. అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ అంశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కుమారుడు రవి ఇటీవల విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో చంద్రబాబును కలిశారు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది.
ముత్యాలనాయుడి మొదటి భార్య కుమారుడు రవి. అయితే ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మాడుగుల నియోజకవర్గంలో ముత్యాలనాయుడు రెండో భార్య కుమార్తె ఈర్లె అనురాధ చురుగ్గా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తండ్రితో కొన్నాళ్లుగా రవికి విబేధాలున్నాయని తెలుస్తోంది.
తండ్రి, కుమారులు కొన్నాళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని స్థానికంగా వినిపిస్తున్న వార్తలు. గత జడ్పీటీసీ ఎన్నికల సమయంలో రవికి తండ్రితో విభేదాలు మొదలయ్యాయి. జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన రవికి టిక్కెట్ దక్కలేదు. కానీ అనురాధను మాత్రం జెడ్పీటీసీగా గెలిపించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో తండ్రి తర్వాత ఆమె కీలకంగా మారారు.
పార్టీ కార్యక్రమాలతోపాటు కుటుంబ వ్యవహారాల్లో పూర్తిగా దూరం పెడుతున్నారని రవి సన్నిహితుల దగ్గర బాధపడేవారని తెలుస్తోంది. అధికార పార్టీలో ఉన్నా తనకు గుర్తింపు ఉండదనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోళ్ల లలితకుమారి రవికి బంధువు. గత నెలలో చంద్రబాబు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం ఆ నియోజకవర్గంలోనే నిర్వహించారు. ఆ సమయంలోనే లలితకుమారి నివాసంలో చంద్రబాబును రవి కలిశారు. ఆలస్యంగా ఈ ఫోటో వెలుగులోకి వచ్చింది. ఇక రవి టీడీపీలో చేరడం లాంఛనమే అంటున్నారు.