Deputy CM Pawan Kalyan: ఆయనొక ఉన్నతాధికారి. కానీ ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఇతర అధికారులను బెదిరిస్తున్నారని అధికారుల ఆరోపణ. ఇంతకు ఫిర్యాదులు కూడా ఏకంగా చేరింది డిప్యూటీ సీఎం చెంతకే. ఈ ఫిర్యాదులను సీరియస్ గా తీసుకున్న డిప్యూటీ సీఎం.. అసలు ఇందులో వాస్తవమెంత.. పూర్తి విచారణ చేయాలని ఆదేశించారు. ఇక అసలు విషయంలోకి వెళితే..
కాకినాడ అటవీశాఖ అధికారిగా రవీంద్రనాథ్రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఈ జిల్లాలోనే డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఉంది. అయితే అటవీశాఖ అధికారి రవీంద్రనాథ్రెడ్డి తీరుపై నేరుగా డిప్యూటీ సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు కోకొల్లలుగా వస్తున్నాయట. జిల్లా అటవీశాఖ అధికారిగా రవీంద్రనాథ్రెడ్డి గత మంగళవారమే బాధ్యతలు స్వీకరించారు. ఆయన సత్యసాయి జిల్లా నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఈ క్రమంలోనే ఫిర్యాదులు రావడం విశేషం.
స్థానిక మైనింగ్, అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి రవీంద్రనాధ్ రెడ్డి బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపముఖ్యమంత్రి పేరు చెప్పి ఫోన్ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వచ్చినట్లు సమాచారం. దీనితో వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది. ఇంతకు ఈ ఆరోపణలు వాస్తవమేనా… లేక సదరు అధికారిపై కావాలనే ఆరోపణలు వినిపిస్తున్నాయా అనేది అధికారుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. ఆరోపణలు నిజమైతే మాత్రం సదరు అధికారిపై చర్యలు తీసుకొనేందుకు అటవీ శాఖ సన్నద్దమవుతోంది.
తన పేరు గానీ, తన కార్యాలయం పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే పవన్ హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా డిప్యూటీ సీఎం పేరు వాడుకొని.. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే, చర్యలు తప్పవని.. అటువంటి వారి వివరాలు తమ కార్యాలయానికి తెలియజేయాలని ప్రకటన విడుదలైంది. అసలు మంగళవారం భాద్యతలు స్వీకరించిన అధికారిపై.. అనతికాలంలోనే ఫిర్యాదులు రావడం విశేషం కాగా.. ఏకంగా పవన్ పేషీలోని అధికారులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రవీంద్రనాథ్రెడ్డి బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో.. అసలు కాకినాడ జిల్లాలో అందరి అధికారుల తీరు ప్రజా సంక్షేమ పాలనకు అనుకూలంగా ఉందా లేక.. ఎక్కడైనా అవినీతికి చోటు ఉందా అనే రీతిలో కూడా విచారణ సైలెంట్ గా నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఇక,
పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలోని 52 గ్రామ పంచాయతీలలో పాఠశాలలు, వైద్యశాలలు, హాస్టల్స్, త్రాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని పవన్ ఇటీవల జిల్లా కలెక్టర్ కు దిశానిర్దేశం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో అన్ని శాఖలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం పాల్గొని తనిఖీలు చేపట్టాలని, సమస్యలను గుర్తించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనితో కాకినాడ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని అన్ని గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు పాల్గొని అక్కడ పరిస్థితుల తనిఖీ చేస్తూ, సమస్యలను గుర్తిస్తూ నివేదికను సిద్ధం చేసేందుకు పనిచేస్తున్నారు. ఈ నివేదికను త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించి, అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు.