Deputy CM Pawan Kalyan: ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య సూచన చేశారు. దయచేసి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఆ ఒక్క పని చేయవద్దంటూ పవన్ కోరారు. భావితరాల కోసం తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు కూడా కట్టుబడి ఉండాలని పవన్ అన్నారు.
విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సంధర్భంగా పవన్ మాట్లాడుతూ.. అతిసార ప్రభావంపై, స్వచ్ఛ భారత్ ద్వారా కేంద్రం బహిరంగ మల విసర్జన అరికట్టేందుకు విస్తృత ప్రచారం చేసిందన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలా చోట్ల మార్పు రాలేదన్నారు. దీని ఫలితం స్థానిక నీటి పరివాక్మక ప్రాంతాలు కలుషితం అయిపోయి, ఆ నీరు తాగడం వలన రోగాల బారిన పడుతున్నారన్నారు. దీనిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ప్రజలపై ఉందని, అలాగే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆధికారులను పవన్ ఆదేశించారు.
బహిరంగ మలవిసర్జన కారణంగా నీటిని కలుషితం చేస్తున్నారని, దీని వలన మీ ప్రాణాలే కాకుండా ప్రజల ప్రాణాలు ప్రమాదంలోకి నెడుతున్నారన్న విషయాన్ని గ్రహించాలన్నారు. ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ భాద్యతగా అవగాహన కల్పించాలని, అధికారులు, పంచాయతీ సర్పంచ్ లు ఆ భాధ్యత తీసుకోవాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ, జల్ జీవన్ మిషన్ కోసం నిధులు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదని, త్వరలో మరో దాదాపు రూ.650 కోట్లు గ్రామీణ నీటి సరఫరా కోసం కేంద్ర నిధులు రానున్నట్లు శుభవార్త చెప్పారు పవన్. వాటిని కూడా నీటి సరఫరా మెరుగు పరిచేందుకు, రక్షిత మంచినీరు అందించేందుకు వినియోగించనున్నామన్నారు.
మేము గత ప్రభుత్వాలను విమర్శించడం లేదు, కానీ గత ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదని వైసీపీని ఉద్దేశించి అన్నారు. గత పాలకులు వీటిపై దృష్టి సారించి ఉంటే, నీరు కలుషితం అవ్వకుండా ఫిల్టరింగ్ సక్రమంగా జరిగి ఉండేదన్నారు. 15 వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేసైనా కూడా పనిచేయవచ్చు. కానీ అధికారులు గతంలో నిధులు రాలేదంటున్నారు, దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారంటూ ప్రశ్నించారు. గుర్ల గ్రామంలో చనిపోయిన ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగతంగా తాను లక్ష రూపాయలు అందించనున్నట్లు, ప్రభుత్వ నివేదిక వచ్చాక ప్రభుత్వం తరఫున కూడా ఆర్థికంగా ఆదుకుంటామని పవన్ అన్నారు.