Kanipakam : ఆయన ఏపీలో ప్రసిద్ధి చెందిన ఆలయంలో అర్చకుడు. నిత్యం పూజలు చేస్తూ స్వామివారికి సేవ చేస్తారు. అలాంటి పూజారి ఇంట్లో జింక చర్మం దొరకడం కలకలం రేపుతోంది.
పూజారి ఇంట్లో జింక చర్మం..
కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలోని పోటు, గిడ్డంగి, అన్నదాన సత్రంలో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆలయ ఈవో వెంకటేశు ఆధ్వర్యంలో సిబ్బంది ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈక్రమంలోనే కాణిపాకం అనుబంధ ఆలయమైన వరదరాజులస్వామి ఆలయ అర్చకుడు కృష్ణమోహన్ నివాసంలో జింక చర్మాన్ని గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. డీఎఫ్వో చైతన్య కుమార్రెడ్డి ఆదేశాలతో అటవీశాఖ అధికారులు జింక చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. అర్చకుడు కృష్ణమోహన్ను అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ద్వారా జింక చర్మాన్ని కొన్నట్లు కృష్ణమోహన్ విచారణలో వెల్లడించారు. జింక చర్మం విక్రయించిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎఫ్ఆర్వో బాలకృష్ణారెడ్డి తెలిపారు.
సిబ్బంది చేతివాటం..
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయ అన్నదానం, గిడ్డంగి, పోటుల్లో పనిచేస్తున్న సిబ్బందిపై వచ్చిన ఆరోపణలతో.. వారి ఇళ్లలో ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, ఈవో వెంకటేశు దాడులు చేశారు. నలుగురు వంటమనుషుల ఇళ్లలో బియ్యం బస్తాలు, ఇతర సరకులు గుర్తించారు. గిడ్డంగి, పోటులో పనిచేసే వారి ఇళ్లలో బియ్యం, చక్కెర, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సరుకులను ఆలయ గిడ్డంగికి తరలించారు.
నిత్యం 2,500 మందికి అన్నదానానికి , సేవల ప్రసాదాలకు గిడ్డంగి నుంచి ముందురోజు సరుకులు తీసుకెళ్తారు. వాటిలో కొన్ని సరుకులను సిబ్బంది ఇళ్లకు తరలిస్తున్నారు. దీంతో ఈవో అన్నదాన భవనం వద్ద వేచి ఉండి.. సరకులు తరలిస్తున్న ద్విచక్రవాహనాన్ని వెంబడించారు. వంటమనిషి ఇంటికి వెళ్లి పరిశీలించారు. అక్కడ కొన్ని సరకులు గుర్తించారు. మిగిలిన సిబ్బంది నివాసాల్లో తనిఖీ చేసి రూ.1.30 లక్షల విలువైన సరకులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు సిబ్బంది ఇళ్లలో సరకులు ఉన్నాయని గుర్తించారు. ఇలా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యకేత్రంలో పనిచేసి సిబ్బంది అక్రమాలకు పాల్పడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పూజారి ఇంట్లో జింక చర్మం దొరకడం కలకలం రేపుతోంది. కాణిపాకం ఆలయంలో ఏం జరుగుతోందని భక్తులు ప్రశ్నిస్తున్నారు.