Debate On AP Capital Issue Amaravathi Vs Vizag: ఏపీ రాజధాని ఏది? ఉండబోయేది ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనా? లేక మూడు రాజధానులా? పరిపాలన అమరావతి నుంచి జరగబోతుందా? లేక విశాఖ నుంచా? అసలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏ ప్రాంత పరిస్థితి ఎలా ఉండబోతుంది? అసలు రాజధాని విషయంలో ఏపీలో ఏం జరుగుతోంది? అమరావతి వర్సెస్ విశాఖ.. యస్.. ఏపీ పాలిటిక్స్లో మొన్నటి వరకు ఇదే అంశంపై చాలా హాట్ హాట్గా ప్రచారం జరిగింది.. ఇప్పుడు అంతకుమించి హాట్ డిబెట్ జరుగుతోంది.
తాము గెలిస్తే రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని తేల్చేసింది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. తాము గెలిస్తే అమరావతి ఒక రాజధానిగా మాత్రమే ఉంటుందని.. పాలన మొత్తం విశాఖ నుంచే జరుగుతోందని వైసీపీ బల్లగుద్దీ మరి చెప్పిన మాట.. దీంతో జూన్ 4న రాబోయే ఫలితాలతో ఏపీ రాజధానిపై ఓ క్లారిటీ రానుంది. నిజానికి జెండా సభ వేదికగా అమరావతి రాజధాని అని టీడీపీ-జనసేన కూటమి ప్రకటించింది. విశాఖ గడ్డపై రాజధాని ఎజెండాను ప్రకటించి ఎన్నికలకు సిద్ధమన్నారు సీఎం జగన్.మళ్లీ గెలుస్తున్నాం.. విశాఖలోనే ప్రమాణం చేస్తా… విశాఖ నుంచే పాలన కొనసాగిస్తా అనేశారు జగన్.. అంతేకాదు ఆయన మళ్లీ ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకుంది వైసీపీ.. జూన్ 9న వైజాగ్లో మరోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇవన్నీ చూస్తుంటే.. ఎవరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్నదే తన టార్గెట్గా కనిపిస్తోంది. వైసీపీ సర్కార్ ఇప్పటి వరకు చెబుతున్నదేంటి. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను పరిపాలన రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని.. ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. అయితే టీడీపీ దీనిని కోర్టుకు వెళ్లి అడ్డకుంది. అయినా కూడా జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందే అంటున్నారు.
Also Read: వైసీపీ నేతల తీరు సిగ్గుచేటు: అశోక్ బాబు
అయితే రాజధాని రైతుల వర్షన్ మాత్రమ మరోలా ఉంది. ఏపీకి సింగిల్ రాజధాని చాలు.. అది కూడా అమరావతే అనేది వారి వర్షన్.. దీని కోసం చాలా ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారు. టెంట్లు వేసుకొని మరీ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వీరికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు టీడీపీ, జనసేన నేతలు.. దీంతో వివాదం అమరావత్సి వర్సెస్ విశాఖగా మారింది. ఎన్నికల ముందే ఎవరి స్టాండ్ ఏంటో క్లియర్ కట్గా ప్రజల ముందు పెట్టారు ఇరు పార్టీల నేతలు. అంటే ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు.. ఓ రెఫరెండం అనుకోవచ్చు.. ప్రజాకోర్టులోనే ఇరు పార్టీలు ఈ పంచాయితీని తేల్చుకోనున్నాయి.
నిజానికి దీనికి సంబంధించి ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చేచ్చారు. ఈవీఎం మెషిన్లలో వారి తీర్పు భద్రంగా ఉంది. ఇప్పుడా బాక్స్లు ఓపెన్ చేస్తే.. ఏపీకి రాజధాని నగరాలు ఒకటా.. లేక మూడా అనేది తేలనుంది. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. ఓటింగ్ ఎవరికి అనుకూలంగా పడింది అనేది అస్సలు అంతు చిక్కడం లేదు. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. గెలుపు మాదంటే మాదంటున్నాయి. ఇదే ఇక్కడ కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తోంది. వైసీపీ ఏమో ఏకంగా ప్రమాణస్వీకారోత్సవ వేదికను కూడా ఖరారు చేసుకుంది. టీడీపీ ఏమో.. సీఎంగా ప్రమాణస్వీకారోత్సవం చేసేది చంద్రబాబు నాయుడే అని.. ఎన్నికల తర్వాత వైసీపీ అడ్రస్ గల్లంతే అంటోంది. అయితే ఎవరు చెప్పేది నిజం? ఎవరు చెప్పేది అబద్ధం? ఏపీకి ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనా? లేక మూడు రాజధానుల్లో అమరావతి ఒకటిగా ఉంటుందా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం జూన్ 4న తేలనుంది.