Cyclone Michaung Update : నెల్లూరు జిల్లా మైపాడు, రామతీర్థం మధ్య ముత్తుకూరు వద్ద సోమవారం అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుంటటంతో చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో గత రాత్రి నుండి జిల్లా అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక చోట్ల మొబైల్ నెట్ వర్క్స్ ఆగిపోయాయి. వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సూళ్లూరుపేటలో కాలంగి ఉధృతికి జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు చేరుకుంది. దాంతో నెల్లూరు నుంచి చెన్నైకి రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలో తీవ్ర స్థాయిలో వర్షపునీరు నిలిచిపోవటంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో చెరువుల్లోకి నీరు చేరడంతో పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. ప్రస్తుతం కావలి ఉప్పరపాలెం వద్ద మిచౌంగ్ తుపాన్ అల్పపీడనంగా బలహీనపడి కొనసాగుతుంది. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుడండతో సముద్రం ముందుకు వచ్చింది. తుపాను తీరందాటినా.. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
.
.