Cyclone Michaung : ఏపీలో మిగ్జాం తుపాను ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిజాంపట్నం హార్బర్లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం తీరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. హార్బర్ సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు. చినగంజాం, పల్లిపాలెం తీరం వెంబడి అలల తాకిడి పెరిగింది. చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భక్తులకు తాగునీరు అందించే జలాశయాలకు జలకళ వచ్చింది. పాపవినాశనం, కుమారధార, పసుపుధార, గోగర్భం, ఆకాశగంగ జలాశయాలు పూర్తిగా నిండాయి. తిరుమలలో 24 గంటల్లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
అటు తమిళనాడులోనూ తుపాను తీవ్రత ఎక్కువగానే ఉంది. చెన్నై విమానాశ్రయంలో భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.