Cumbum Cheruvu : రియల్టర్ల అక్రమార్జన ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కంభం చెరువు పాలిట శాపంగా మారింది. చెరువు నుంచి దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలకు పోయే నీటి కాలువలను అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు. పక్కనే ఉన్న పొలాలతో కలిపి వెంచర్లుగా మార్చుతున్నారు.
కంభం చెరువు పరివాహకంలో ఉన్న పంట పొలాలను రియల్టర్లు రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నారు. దిగువకు వెళ్లే పంట కాలువలను కూడా పూడ్చివేసి ఇల్లు కట్టుకున్నారు. దీంతో చెరువులో భారీగా నీరు చేరితే వాటిని దిగువకు విడుదల చేయడం కష్టంగా మారుతోంది. దిగువన ఉన్న పంట పొలాలకు కూడా నీరందడంలేదు.
ఈ ప్రాంతంలో భారీ మొత్తాన్ని వెచ్చించి పలువురు భూములు, ఇళ్లు కొనుగోలు చేశారు. దిగువకు వచ్చే నీటిలో ఆయా ఇళ్లు, స్థలాలు మునిగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే రంగంలోకి దిగి అక్రమార్కులకు చెక్ పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.