Crime News: తనకు పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మింది. తాను బెదిరించి రమ్మని పిలిస్తే వెళ్లింది. ఇంకేముంది ఆ దుర్మార్గుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చివరి వరకు కొనఊపిరితో కొట్టుమిట్టాడింది. ప్రాణాలు విడిచింది. ఇంతటి దారుణ ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థినిని నమ్మించి పెట్రోల్ పోసి హత్య చేసేందుకు యత్నించిన ఘటన అందరికీ తెలిసిందే. అయితే తీవ్ర గాయాల పాలైన ఆ విద్యార్థిని కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూసింది. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం మండలంలో.. ఈ దారుణ ఘటన జరగగా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే.. స్థానికుల వివరాల మేరకు..
కడప జిల్లా బద్వేల్ లోని రామాంజనేయ నగర్ లో మృతి చెందిన బాలిక కుటుంబం నివసిస్తోంది. అదే కాలనీకి చెందిన విఘ్నేష్ అనే యువకుడు జులాయిగా తిరుగుతూ.. బాలికను ప్రేమిస్తున్నాను అంటూ వేధించేవాడు. బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలుపగా.. పలుమార్లు విఘ్నేష్ను మందలించారట. ఇక కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్న విఘ్నేష్, మరో అమ్మాయిని ప్రేమించాడు.. వివాహం కూడా చేసుకున్నాడు.
వివాహమైనా కూడా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక వెంట ప్రేమ పేరుతో వేధిస్తూ నీవు లేకుంటే నేను బ్రతకలేనని వెంటపడేవాడు. ఇలా వెంటపడుతూ నీవు రాకుంటే నేను చనిపోతాను అంటూ శనివారం బాలికను బెదిరించాడు. ఇక నిజంగానే చనిపోతాడేమో అనుకున్న మృతురాలు.. అతనితో పాటు వెళ్ళింది. చివరికి శవంలా మారింది.
తాను అనుకున్న ప్రదేశానికి తీసుకెళ్లి తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆ బాలికపై ఒత్తిడి తెచ్చాడు విఘ్నేష్. పెళ్లి జరిగింది కదా.. ఇలా నన్ను వేధించవద్దు అంటూ బాలిక కోరింది. ఇంకేముంది విఘ్నేష్ కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాలిన గాయాలతో ఉన్న బాలికను స్థానికులు కడప రిమ్స్ వైద్యశాలకు తరలించారు. ఈ తరుణంలో మృత్యువుతో పోరాడుతూ మైనర్ బాలిక ప్రాణాలు విడిచింది.
మైనర్ బాలిక మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి రోదనలతో వైద్యశాల మిన్నంటింది. సదరు బాలిక మృతి చెందినట్లు సమాచారం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన వైద్యశాల వద్దకు భారీగా చేరుకుంటున్నారు.
Also Read: AP Liquor Sales: తెగ తాగేశారు.. మూడు రోజుల్లో మరీ ఇంత ఆదాయమా.. మద్యం ప్రియులా మజాకా..
అయితే నిన్న ఘటన జరిగిన సమయం నుండి సీఎం చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పోలీసులను అప్రమత్తం చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా సీఎం చంద్రబాబు సైతం హుటాహుటిన స్పందించి, బాలికకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినా.. చివరకు బాలిక క్షణక్షణం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ తుదిశ్వాస విడిచింది. నిందితుడికి మాత్రం చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఓ మానవ మృగం కబంధ హస్తాలలోకి వెళ్లేందుకు నిరాకరించిన ఆ బాలిక మాత్రం సమాజానికి దూరమైంది.
బద్వేల్ పట్టణంలో హత్యయత్నానికి గురికాబడిన ఇంటర్ విద్యార్థిని మృతి.
పోలీసుల అదుపులో అత్యాయత్నం చేసిన విగ్నేష్. బద్వేలు-మైదుకూరు రోడ్డులో విగ్నేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.#Badvel #MurderAttempt #InterStudentDeath #BigTV https://t.co/ijXkGFTSq6 pic.twitter.com/SKyePJwnIz
— BIG TV Breaking News (@bigtvtelugu) October 20, 2024