టీడీడీ ఛైర్మన్ పదవి భూమన కరుణాకర్ రెడ్డి ఇవ్వడంపై వివాదం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ నేతలు మొదటి నుంచి తప్పుపడుతున్నారు. తాజాగా బీజేపీ నేతలు మరోసారి విమర్శలు గుప్పించారు. తాను క్రిస్టియన్ అని వివిధ వేదికలపై భూమన గతంలో చెప్పుకున్నారని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు అన్నారు. క్రైస్తవ మతంపై అభిమానం ఉన్న వ్యక్తులను టీటీడీ ఛైర్మన్ పదవిలో నియమించడం మంచిపద్దతి కాదని సూచించారు. ఈ నిర్ణయాన్ని తాము ఖండిస్తున్నామన్నారు.
తనపై వస్తున్న కామెంట్స్ పై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. విమర్శలకు భయపడేవాడిని కాదని స్పష్టం చేశారు. తాను నాస్తికుడని విమర్శలు చేసిన వారికి కౌంటర్ ఇచ్చారు. 17 ఏళ్ల క్రితమే తాను టీటీడీ ఛైర్మన్ పదవిని చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో టీటీడీ ఛైర్మన్ గా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలను భూమన వివరించారు. కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా 30 వేల మందికి సామూహిక వివాహాలు జరిపించామని వివరించారు. తిరుమల ఆలయ మాడవీధుల్లో చెప్పులతో నడవ కూడదనే నిర్ణయం తానే తీసుకున్నానని వెల్లడించారు.
గతంలో తన హయాంలో అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు నిర్వహించామని భూమన తెలిపారు. దళితవాడల్లో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం జరిపించామన్నారు. తాను క్రిస్టియన్ అని, నాస్తికుడని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే తన సమాధానమని కౌంటర్ ఇచ్చారు. పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడిని, ఇలాంటి విమర్శలకు భయపడనని భూమన స్పష్టం చేశారు.