TDP latest news(Political news in AP): రాజమండ్రి పసుపుదళం బలప్రదర్శణ. రెండు రోజుల పాటు ఘనంగా మహానాడు నిర్వహణ. ఎన్నికల ముందు జరిగిన ఈ మహానాడు పార్టీకి ఎంతో ప్రత్యేకమైనది. అందుకే, నాయకుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. మహానాడు వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించి.. ఎన్నికల ప్రచారానికి శంఖారావం ఊదారు. ఆణిముత్యాల్లాంటి 6 హామీలను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని ఘనంగా చాటిచెప్పారు.
ఇంతవరకూ బాగుంది. తమ్ముళ్లంతా రెట్టించిన ఉత్సాహంతో రాజమండ్రిని వీడారు. కట్ చేస్తే, ఆ మర్నాటి నుంచే టీడీపీ మేనిఫెస్టోపై విమర్శలు స్టార్ట్ అయ్యాయి. వైసీపీ నేతలు సజ్జల, కొడాలి నాని, జోగి రమేశ్లు మీడియా ముందుకు వచ్చి.. చంద్రబాబును, టీడీపీ హామీలను ఎప్పటిలానే కుమ్మేశారు. అయితే, సజ్జల చేసిన ఓ ఆరోపణ మాత్రం ఆసక్తికరంగా ఉంది. “మేం అమలు చేస్తున్న హామీలను కూడా కాపీ కొట్టి పెట్టారు”.. ఇదీ సజ్జల కామెంట్. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
నిజమేనా? టీడీపీ హామీలు కాపీ కొట్టినవా? వైసీపీ ఇప్పటికే అమలు చేస్తున్న హామీలను కాస్త అటూఇటూ మార్చి ప్రకటించారా? అనే చర్చ మొదలైంది. అటు, కర్నాటకలో కాంగ్రెస్ అమలు చేసిన స్ట్రాటజీని కూడా.. ఏపీ టీడీపీ కాపీ కొట్టిందంటూ మరో టాక్.
కర్నాటకలో గ్యారెంటీ కార్డ్ పేరుతో 5 హామీలను ప్రముఖంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అవి ప్రజల్లోకి బాగా వెళ్లాయి. హస్తం పార్టీని గెలిపించాయి. గత ఎన్నికల్లో వైసీపీ సైతం నవరత్నాల పేరుతో కేవలం తొమ్మిదంటే తొమ్మిదే హామీలు ఇచ్చి.. వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి విజయం సాధించింది. వాటి నుంచి నేర్చుకున్నట్టుంది టీడీపీ. కర్నాటకలో ‘గ్యారెంటీ కార్డు’ పేరుతో రిలీజ్ చేస్తే.. చంద్రబాబు మాత్రం ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో తొలి విడత మేనిఫెస్టో వదిలారు. అక్కడా ఇక్కడా.. గ్యారెంటీ పదం సేమ్ టు సేమ్.
కర్నాటక కాంగ్రెస్ ఏడాదికి కొన్ని ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామంది. ఇప్పుడు టీడీపీ సైతం ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం ఆసక్తికరం. కర్నాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రామిస్ చేసింది. ఈ హామీ కూడా టీడీపీ ఇచ్చేసింది. కర్నాటకలో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చంద్రబాబు సైతం నిరుద్యోగ యువతకు నెలకు 3వేలు ఇస్తామని ప్రకటించారు. గతంలో అధికారంలో ఉన్న చివరి రోజుల్లో కొన్ని నెలల పాటు నిరుద్యోగ భృతి ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం. ఆ పథకాన్ని మళ్లీ కొనసాగిస్తామని ప్రకటించడం విశేషం.
కర్నాటక కాంగ్రెస్ హామీలే కాదు.. కొన్ని వైసీపీ పథకాలను పోలిన హామీలను ప్రకటించారు చంద్రబాబు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం.. పథకాలు ఇలాంటివే. కాకపోతే జగన్ సర్కారు కొంతమందినే ఈ పథకాలకు అర్హులను చేస్తే.. టీడీపీ మాత్రం అర్హులందరికీ ఇస్తామనడం అనకూలాంశం. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రతి నెలా రూ.1,500 చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఒక ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని చంద్రబాబు చెప్పారు. ఒక్కొక్కరికి ఏడాదికి మొత్తం రూ.18 వేల చొప్పున అందుతుందన్నారు.
తల్లికి వందనం.. ఇది పక్కా అమ్మ ఒడిలానే ఉందంటున్నారు. చదువుకుంటున్న పిల్లల తల్లులకు ఏటా రూ.15 వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అందించడమే తల్లికి వందనం. అన్నదాత పథకం.. కూడా మరో రూపంలో అమలవుతోంది. కాకపోతే ఆర్థిక సాయాన్ని 20వేలకు పెంచి ప్రకటించారు. తెలంగాణలో రైతుబంధు పథకం ఇప్పటికే సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అటు, ఇంటింటికీ మంచినీటి పథకం.. తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథలాంటిదే అంటున్నారు.
ఇలా ఈపార్టీ ఆపార్టీ.. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అనే తేడా లేకుండా.. కర్నాటక, తెలంగాణ, ఏపీ, కాంగ్రెస్, వైసీపీ, బీఆర్ఎస్.. ఎక్కడ కాస్త మంచి పథకం ఉన్నా.. ఓట్లు రాల్చే హామీ ఉన్నా.. అవన్నిటినీ ఏర్చికూర్చి.. భవిషత్తుకు గ్యారెంటీ పేరుతో మినీ మేనిఫెస్టో ప్రకటించారంటూ టీడీపీపై విమర్శలు వస్తున్నాయి. ఇదే ఛాన్స్ అనేలా సోషల్ మీడియాలో ఫుల్గా ట్రోల్స్, మీమ్స్, కామెంట్స్తో రచ్చ రచ్చ అవుతోంది.