TTD: 24 మందితో టీటీడీ బోర్డు సభ్యులను ప్రకటించారు. అందులో ఇద్దరి పేర్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలు కేసుల్లో చిక్కుకున్న శరత్ చంద్రారెడ్డి, కేతన్ దేశాయిలకు టీటీడీ ధర్మకర్తల మండలిలో చోటు కల్పించినందుకు బీజేపీ, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏడవ నిందితుడిగా ఉన్నారు శరత్ చంద్రారెడ్డి. జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు. అలాంటి శరత్ చంద్రారెడ్డిని టీటీడీ మెంబర్గా నియమించడాన్ని తప్పుబడుతున్నారు.
గుజరాత్కు చెందిన కేతన్ దేశాయ్ పైనా వివాదం నడుస్తోంది. గుజరాత్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయనపై 8 కేసుల్లో ఎఫ్ఆర్ఐలు నమోదయ్యాయి. ప్రస్తుతం రెండు కేసులలో నిందితుడుగా ఉన్నారు. అలాంటి కేతన్ దేశాయ్ని టీటీడీ బోర్డులో ఎలా నియమిస్తాంటూ విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మతంపై ఆరోపణలు ఉండగా.. ఇప్పుడిలా బోర్డు సభ్యుల నియామకం సైతం కాంట్రవర్సీగా మారడం కలకలం రేపుతోంది. తీహార్ జైలులో ఉన్న వారితో టీటీడీ పాలక మండలి లిస్ట్ తయారు చేశారా అని.. ఆర్థిక నేరాలు చేసి జైలుకు వెళ్లొచ్చినవారికి టీటీడీ బోర్డు మెంబర్లను చేశారా? అని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం టీటీడీ తీరుపై మండిపడ్డారు. టీటీడీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి దేవస్థానమా? అంటూ బీజేపీ నేత భానుప్రకాశ్రెడ్డి ప్రశ్నించారు.