Gitam Medical College : విశాఖలో భూముల వివాదం ఎంతోకాలం నడుస్తోంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ భూములను కాజేశారని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వమే విశాఖ భూములపై కన్నేసిందని టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. చాలాకాలం ఈ వివాదం నడుస్తూనే ఉంది. మరోవైపు ప్రభుత్వ భూముల రికార్డులను దుమ్ము దులుపుతోంది వైసీపీ సర్కార్. ఎక్కడెక్కడ సర్కార్ స్థలాలు ఉన్నాయో లెక్కలు తీస్తోంది. ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేస్తే కూల్చేస్తోంది.
గతేడాది మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్న ఇంటి ప్రవారీ విషయంలో పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఇటీవల ఇప్పటం గ్రామంలో ఇదే రచ్చ జరిగింది. ఇప్పుడు విశాఖలోని గీత విశ్వవిద్యాలయంపై జగన్ ప్రభుత్వ కన్నెర్ర జేస్తోంది. ఈ యూనివర్శిటీ ఎవరో కాదు.. స్వయనా బాలకృష్ణ చిన్నల్లుడు కుటుంబానిది. ఆయన తాత ఎంవీవీఎస్ మూర్తి ఈ యూనివర్శిటీని స్థాపించారు. గతంలో ఎంవీవీఎస్ మూర్తి విశాఖ ఎంపీగానూ పనిచేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. ఆయన మనవడు, నారా లోకేశ్ తోడల్లుడు భరత్ గత ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
విశాఖలోని గీతం వైద్య కళాశాల మైదానాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడంపై పెద్ద రచ్చ జరుగుతోంది. భీమిలి ఆర్డీవో, విశాఖ డీఆర్వో పర్యవేక్షణలో కళాశాల గ్రౌండ్ చుట్టూ సిబ్బంది ఇనుపకంచె ఏర్పాటు చేశారు. గీతం వర్సిటీ ప్రధాన ద్వారం, వైద్య కళాశాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు పెట్టారు. మీడియాను వైద్యకళాశాల లోపలికి అనుమతించలేదు. గీతం మెడికల్ కళాశాల మైదానాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడంపై గీతం యూనివర్శిటీ యాజమాన్యం మండిపడింది. కనీస సమాచారం ఇవ్వకుండా కంచె ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికారులు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.
మెడికల్ కళాశాలను ఆనుకొని ఉన్న 14 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని భీమిలి ఆర్డీవో భాస్కర్రెడ్డి వెల్లడించారు. రుషికొండ గ్రామ సర్వే నంబర్ 37, 38లోని స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గతంలోనే ఈ స్థలాన్ని మార్క్ చేశామని వివరించారు. శుక్రవారం 5.25 ఎకరాల్లో కంచె వేశామని తెలిపారు. 10 చోట్ల ప్రభుత్వ భూమిగా బోర్డులు పెట్టామని ఆయన వివరించారు. రాజకీయ దురుద్దేంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ నేతలు రంగంలోకి దిగడంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. మరి వైసీపీ సర్కార్ ఏం చేస్తుందో చూడాలి మరి.