Former Chief Ministers Behind SC Classification(AP news live): ఒక పని అనుకుంటే దాన్ని సాధించేదాకా పట్టు విడవకపోవడం కార్యసాధకుల లక్షణం. పని పూర్తి చేయడానికి ఎలాంటి కష్టనష్టాలైనా లెక్క చేయరు. ఇలా ఉంటుంది కొందరి పని తీరు. కానీ ఇంకొందరైతే మాతో అయ్యేది కాదు పోయేది కాదంటూ చేతులెత్తేస్తుంటారు. ఇదంతా ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇద్దరు మాజీ సీఎంలు ఎలా హ్యాండ్సప్ చేశారో ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తోంది. ఏపీ మాజీ సీఎం జగన్ గతంలో అసెంబ్లీలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతుండగా, అటు మాజీ సీఎం కేసీఆర్ కూడా మందకృష్ణ మాదిగతో వర్గీకరణ పోరాటం అయ్యేది కాదు పోయేది కాదన్నారు. ఏం సందర్భంలో వాళ్లు ఎందుకలా మాట్లాడారు? ఇప్పుడు అవి రివర్స్ ఎందుకవుతున్నాయో చూద్దాం.
ఎస్సీ వర్గీకరణ విషయంలో జరిగిందేంటన్నది ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఈనాటిది కాదు. దీని వెనుక 30 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే చిన్న గ్రామంలో దండోరాతో వర్గీకరణ ఉద్యమం మొదలైంది. సమానత్వం కావాలి. దళితుల్లో వెనుకబడిన ఉప కులాలకు న్యాయం జరగాలన్న డిమాండ్ తో మొదలైన ఈ ఉద్యమం 3 దశాబ్దాల తర్వాత ఫలించింది. ఎస్సీ వర్గీకరణకు ఉన్న న్యాయపరమైన, సాంకేతికపరమైన, చట్టపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయి. అయితే ఇందులో ఎవరి పాత్ర ఎంత? ఎవరెవరు ఏమేం చేశారన్న పాయింట్స్ ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. సుప్రీం కోర్టులో అనుకూల తీర్పు వచ్చే సరికి మేము అది చేశాం.. ఇది చేశామని అంతా చెప్పుకుంటున్నారు. మరి అసలు చేసిందెవరు? ఉద్యమాన్ని అణచి వేయాలని చూసింది ఎవరు? అన్నది ఇప్పుడు హాట్ డిబేట్ గా మారింది.
రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చిందే వెనుకబడిన వర్గాలకు మేలు జరగాలని. మరి కాలక్రమంలో ఆ ప్రయోజనం నెరవేరకపోతే., అది ముమ్మాటికీ ఇబ్బందికరమే. కాబట్టి ఇవన్నీ గమనించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వాదోపవాదాలు అన్నీ విన్న తర్వాత కోటాలో సబ్ కోటా చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని తీర్పు ఇచ్చింది. కాబట్టి నిజానికి ఇది ఎప్పుడో జరగాల్సిన విషయం. కానీ కొందరి అభ్యంతరాలు, కోర్టు కేసులతో ఇన్నాళ్ల నిరీక్షణ తప్పలేదు. ఫైనల్ గా జడ్జిమెంట్ అయితే వచ్చింది. కానీ ఈ ఉద్యమానికి రాజకీయపరంగా ఎవరు ఏమి చేశారన్నది కూడా చర్చనీయాంశమవుతోంది. నిజానికి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలైందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి. అందుకే ఇది హాట్ డిబేట్ కు దారి తీస్తోంది.
జులై 16, 2019న ఏపీ అసెంబ్లీలో అప్పటి సీఎంగా ఉన్న జగన్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం గురించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగం అంగీకరించదు, ఏదైనా చేసినా అది నిలబడదు, ఎవరైనా కోర్టుకు వెళ్తే కొట్టేస్తుంది అన్న పాయింట్ వినిపించారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని తెలిసీ చంద్రబాబు వర్గీకరణ తెచ్చారంటూ ఆనాడు ఫైర్ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో నాడు జగన్ చేసిన కామెంట్స్ తాజాగా చర్చనీయాంశంగా మారాయి. వర్గీకరణ పేరుతో మాదిగ, మాలల మధ్య విభేదాలు తీసుకువచ్చి.. ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు వర్గీకరణ తెచ్చారని, రాజకీయ లబ్ధి కోసం ఎస్సీల్లో చిచ్చుపెట్టి వర్గీకరణ తీసుకువచ్చారన్నారు. కోర్టు కొట్టేస్తుందని బాబుకు తెలియదా.. తెలిసినపుడు ఎందుకు చేశారంటూ మాట్లాడారు.
నిజానికి చంద్రబాబు ఎస్సీల్లో వెనుకబడిన వర్గాలకు మేలు చేయాలన్న మంచి ఉద్దేశంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేశారు. నాడు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని అమలు చేశారు. ఎస్సీలను ఏబీసీడీ వర్గాలుగా విభజించి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందరికీ అమలు చేశారు. నాలుగేళ్లలో మాదిగలు సహా ఇతర అట్టడుగు వర్గాలకు చాలా మేలు జరిగిందని ఎమ్మార్పీఎస్ నేతలు గుర్తు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. కొద్దో గొప్పో మాదిగలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారంటే అప్పుడు నాలుగేళ్లు ఏబీసీడీ వర్గీకరణ చేసిన చంద్రబాబు చలవే అని మందకృష్ణ మాదిగ సుప్రీం తీర్పు నేపథ్యంలో గుర్తు చేసుకున్నారు. సుప్రీం కూడా కోటాలో సబ్ కోటా ఇవ్వొచ్చని తీర్పు చెప్పింది. అదీ విజన్ ఉండడం అంటే. సమన్యాయం తమ సిద్ధాంతమని చంద్రబాబు చెప్పుకుంటున్నారంటే దాని వెనుక రాజకీయ కోణం లేదు, ప్రజాకోణమే ఉందన్నది మరోసారి నిరూపితమైందంటున్నారు.
Also Read: దటీజ్ అమ్రపాలి ..ఆమె రూటే సెపరేటు
ఇప్పుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ విషయానికొద్దాం. 2018లో ఎస్సీ వర్గీకరణకు తాము పూర్తిగా అనుకూలంగా ప్రధానికి వినతిపత్రం ఇచ్చామని, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని తమ కృషితోనే ఇప్పుడు సుప్రీం కోర్టులో అనుకూల తీర్పు వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా అసెంబ్లీ ఘనంగా చెప్పుకున్నారు. రైట్ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. 2018లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా నాడు సీఎంగా ఉన్న కేసీఆర్.. MRPS గురించి, మందకృష్ణ మాదిగ చేస్తున్న ఉద్యమం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
వందకు వందశాతం వర్గీకరణ న్యాయమైనదే అని, అందులో ఎలాంటి సందేహం లేదని చెబుతూనే అంతా కేంద్రానిదే బాధ్యత అని, తెలంగాణలో చేయడానికి చూడడానికి ఏమీ లేదన్నారు. అంతే కాదు.. ఇక ఇక్కడ ఉద్యమాలు చేసి ఏం లాభమని ప్రశ్నించారు. అక్కడితో ఆగలేదు, మందకృష్ణను నాటి ప్రభుత్వం అరెస్ట్ కూడా చేయించింది. కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారు కేసీఆర్. ఉద్యమాలను వందశాతం అణచివేస్తామన్నారు. మందకృష్ణ మాదిగ పని అయిపోయిందని, వర్గీకరణ పోరాటం ఆయనతో అయ్యే పని కాదన్నారు. ఇన్నేసి డైలాగ్ లు కొట్టి, MRPS ఉద్యమాన్ని ఆపించి… చివరికి వర్గీకరణకు అనుకూలం అనడం కేసీఆర్ కే చెల్లిందన్న చర్చ జోరుగా సాగుతోంది.
వర్గీకరణ విషయం కేంద్రం దగ్గరే ఉందని, సుప్రీం కోర్టు తీసుకోవాల్సిన నిర్ణయమని నాడు కేసీఆర్ దాటవేత వైఖరి ప్రదర్శించారంటున్నారు. సో నాటి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని మందకృష్ణ లాంటి వాళ్లు ప్రయత్నాలు చేస్తే అరెస్టులు చేయించిన ఘనతను గుర్తు చేస్తున్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం రిలాక్స్ కావొద్దన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నాన్ని కూడా అడ్డుకున్న ఘనులు బీఆర్ఎస్ నేతలు అన్న వాదనను వినిపిస్తున్నారు వర్గీకరణ ఉద్యమకారులు.