Congress: ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించారు. మంత్రిగానూ తన దైన ముద్ర వేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఆయనకే అప్పగించింది పార్టీ అధిష్టానం. ఇలా ఓ వెలుగు వెలిగిన ఆ నేతే రఘువీరారెడ్డి. ఆయన 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడంలేదు. నాలుగేళ్లుగా స్వగ్రామం సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలోనే ఉంటున్నారు. అక్కడ ఆయన ఓ సాధారణ వ్యక్తిలా జీవిస్తున్నారు. రఘువీరారెడ్డి వ్యవసాయ పనులు చేస్తున్న ఫోటోలు , వీడియో చాలాసార్లు వైరల్ అయ్యాయి.
రఘువీరారెడ్డి ఇక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారనే అందరూ భావించారు. కానీ ఆయన తాజాగా తన మనసులోని మాటను చెప్పేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్నానని ప్రకటించారు. కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేశారు.
రాజకీయాల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుందామనుకున్నానని రఘువీరారెడ్డి తెలిపారు. కానీ ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక్క మాట అన్నందుకే ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం తన మనసును కలచివేసిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవడం భావ్యమా అని ఆలోచించానని చెప్పుకొచ్చారు. అందుకే ప్రజల ముందుకు వచ్చానని చెప్పారు.
రాహుల్ను అవమానించడం వల్లే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడతారని రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. బెంగళూరు నగర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా తనను నియమించారని తెలిపారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణం కోసమే నాలుగేళ్లు రాజకీయాల నుంచి విరామం తీసుకున్నానని వివరించారు.
రఘువీరారెడ్డి 1985లో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1989లో మడకశిర నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్థకశాఖ మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో ఓడినా మళ్లీ 1999, 2004 ఎన్నికల్లో గెలిచారు. 2009 ఎన్నికల్లో కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 నుంచి రాజశేఖర్ రెడ్డి మరణించే వరకు రఘువీరా వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో రెవెన్యూశాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలను నుంచి తప్పుకున్నారు. ఇప్పడు మళ్లీ పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమయ్యారు. మరి 2024 ఎన్నికల్లో రఘువీరారెడ్డి పోటీకి దిగుతారా..?