ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కర్ణాటక, తెలంగాణలో విక్టరీ సాధించిన హస్తం పార్టీ.. ఏపీలోనూ పాగ వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఏపీ కాంగ్రెస్ నేతలతో ఇవాళ ఢిల్లీలో అధిష్టానం చర్చలు జరపనుంది. ఏపీలో పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారన్న ప్రచారంతో ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న ఆసక్తి రేపుతోంది.
ఏపీలో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశముండటంతో అధికార పీఠంపై కన్నేసింది కాంగ్రెస్ హైకమాండ్. రాష్ట్ర విభజనకు ముందున్న పూర్వవైభవాన్ని చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటక, తెలంగాణలో మాదిరి విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో కాంగ్రెస్ హవా నడిచింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో పరిణామాలు మారిపోయాయి. ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. సీఎం జగన్ వైసీపీ పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ క్యాడర్ అంతా జగన్ చెంతకు చేరిపోయింది. దీంతో 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఏపీలో పూర్వస్థితిని తీసుకువచ్చి.. అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఎత్తుగడలు వేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మాణిక్ రావు ఠాక్రేకు ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది. త్వరలో వైఆర్ఎస్ తనయి, జగన్ సోదరి షర్మిలను కదనరంగంలోకి దించాలని పావులు కదులుపుతోంది.
తెలంగాణ ఎన్నికల సమయంలో షర్మిల ఢిల్లీ అగ్రనేతలతో భేటీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తను ఏర్పాటు చేసిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని జోరుగా ప్రచారం కూడా జరిగింది. హైకమాండ్తో చర్చలు జరిపినా అనుకున్నది జరగలేదు. ఆ సమయంలోనే షర్మిలను ఏపీలో పని చేయాల్సిందిగా ఢిల్లీ పెద్దలు కోరినట్టు వార్తలు కూడా వచ్చాయి.
ఏపీలో ఎన్నికల వేళ మళ్లీ అవే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని ప్రచారం కూడా సాగుతోంది. త్వరలోనే ప్రకటన చేసే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్కు ఏపీలో అభిమానులు ఉండటంతో షర్మిలను దించితే.. వైసీపీకి షిఫ్ట్ అయిన కాంగ్రెస్ క్యాడర్ అంతా తిరిగి వస్తారని ఆశిస్తోంది. ఒకవేళ షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తే తన అన్నను ఎలా ఎదుర్కొంటారనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
ఇక ఈ అంశంపై ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు స్పందించారు. వైఎస్ఆర్ తనయిగా, రాజకీయాల్లో తమకు దగ్గరగా ఉన్న కుటుంబంగా షర్మిల వచ్చి పని చేస్తానంటే అభ్యంతరమేమీ లేదన్నారు. మోస్ట్ వెలకమ్ అంటూ తన మద్దతును తెలిపారు. ఇక మరోవైపు కర్ణాటకలో 5, తెలంగాణలో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఏపీలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగనుంది…? ఎన్నికల హామీలేంటనే అంశాలు ఆసక్తిని రేపుతున్నాయి.