AP Elections : త్వరలో ఏపీలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఓట్ల నమోదు ప్రక్రియపై పోటాపోటీగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఏప్రిల్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో ఉంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న అధికారులు వరుస సమీక్షలతో బిజీ అయ్యారు. ఈ సందర్భంగా విజయవాడలో కేంద్ర ఎన్నికల ప్రతినిధులను కలిసి ఓట్ల నమోదులో అవకతవలపై ఫిర్యాదు చేశారు వైసీపీ, టీడీపీ నేతలు.
వైసీపీ తరపున మంత్రి జోగి రమేష్ మాజీ మంత్రి పేర్ని నానితోపాటు పలువురు వైసీపీ నేతలు ఈసీని కలిశారు. టీడీపీ, జనసేనలు కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దొంగే దొంగన్నట్టు చంద్రబాబు తీరు ఉందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పేర్ని నాని, జోగి రమేష్. మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికి వెళ్లి ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక మరోవైపు ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ నేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఏపీలో అక్రమంగా ఓట్ల తొలగించారని.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు తెలిపింది టీడీపీ బృందం. ఫామ్ -7ను ఉపయోగిస్తూ తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించారని ఆరోపించారు ధూళిపాళ్ల నరేంద్ర.