Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ ప్రాజెక్ట్కు భూమిపూజ చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. చీలాపల్లిలో 300 పడకల మెడికల్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని సీఎం మండిపడ్డారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని ఆరోపించారు. తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే మోసం చేశారని ఆరోపించారు. చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉన్న సమయంలో హెరిటేజ్ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసిందని అన్నారు. తాను ఇచ్చిన మాట ప్రకారం 182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్ చేస్తున్నామన్నారు. అమూల్ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని తెలిపారు.
చంద్రగిరిలో గెలవలేమని కుప్పం వలస వెళ్లారని చంద్రబాబుపై జగన్ విమర్శించారు. ఇప్పుడు కుప్పం ప్రజలు కూడా బైబై బాబు అంటున్నారని తెలిపారు. దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు అభివృద్థి, సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటు వీరుడు.. పవన్ కల్యాణ్ ప్యాకేజీ శూరుడు అని జగన్ సెటైర్లు వేశారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.
10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 150 కోట్లతో దేశంలో అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్ నిర్మిస్తారు. దశలవారీగా పాల కర్మాగారం, బటర్, పాలపొడి, చీజ్, పన్నీర్, స్వీట్ల తయారీ విభాగాలను ఏర్పాటు చేస్తారు. ఈ డెయిరీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 5 వేలమందికి, పరోక్షంగా 2 లక్షల మంది ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం తెలిపింది. 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పింది.