CM Revanth Reddy in YSR Birth Anniversary(AP political news): వైఎస్సార్ స్ఫూర్తితోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారని, జోడో యాత్ర ద్వారానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గుంటూరులోని మంగళగిరిలో దివంగత వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వైఎస్ రాజశేఖర్రెడ్డి మన నుంచి దూరమైనా.. 15ఏళ్లుగా ఆయన్ను గుర్తు చేసుకుంటున్నాం. ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారు. వైఎస్సార్ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో వైఎస్ కు లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు.
వైఎస్తో నాకు ప్రత్యేకమైన అనుభవం ఉంది. మొదటిసారిగా నేను శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్లినప్పుడు.. వైఎస్ దృష్టిని ఆకర్షించేలా మాట్లాడాలని చాలా ప్రిపేర్ అయి వెళ్లేవాడిని. నేను లేవనెత్తిన అంశాలపై నన్ను ప్రోత్సహించేందుకు ఆయన లేచి సమాధానం ఇచ్చేవారు. కొత్తవారిని ప్రోత్సహిస్తే నాయకత్వం బలపడుతుందని వైఎస్ నమ్మేవారు. ప్రతిపక్ష సభ్యులను గౌరవించడం వైఎస్సార్ నుంచి నేర్చుకోవాలి.
రాహుల్ గాంధీ జోడో యాత్ర స్ఫూర్తితో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ సమర్ధవంతంగా పనిచేస్తున్నారు. వైఎస్సార్ అంటే గుర్తొచ్చే మాట.. మాట తప్పను.. మడమ తిప్పను అనే మాట. ప్రతీ పోరాటానికి ఒక సమయం వస్తుంది.. ప్రజలు ఆదరిస్తారు. 1999లో వైఎస్ పోషించిన పాత్రను ఇప్పుడు షర్మిల పోషిస్తున్నారు. ప్రజల గొంతుకై షర్మిల ప్రజల తరపున మాట్లాడుతున్నారు.
ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది.. బీజేపీ అంటే బాబు జగన్ పవన్. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు.. అంతా పాలకపక్షమే. బాబు.. జగన్… పవన్ అందరూ మోదీ పక్షమే. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే నాయకురాలు షర్మిల. 2029లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.
Also Read: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!
వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వారే ఆయన నిజమైన వారసులు. వైఎస్ పేరుతో రాజకీయ వ్యాపారాలు చేసేవాళ్లు ఆయన వారసులు కాదు. వైఎస్సార్ ఆశయాలు కొనసాగించేందుకు షర్మిల ముందుకువెళ్తుంది. షర్మిలకు మేమంతా అండగా నిలబడతామని చెప్పేందుకే మంత్రివర్గ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చాము. కడప పార్లమెంట్కు ఉప ఎన్నిక వస్తుందని కొందరు మాట్లాడుకుంటున్నారు.
నిజంగా కడప పౌరుషాన్ని ఢిల్లీకి చాటే అవకాశం వస్తే.. ఎన్నికల ప్రచారంలో గల్లీ గల్లీ తిరగడానికి నేను వస్తా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.