Amaravati news today(Andhra news updates): అమరావతిలో R5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. లేఅవుట్లో పైలాన్ను ఆవిష్కరించారు. మోడల్ హౌస్ పరిశీలించారు. వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటారు.
వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇళ్లు కట్టిస్తానని గతంలో చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు, ఎల్లోమీడియా, దత్తపుత్రుడు పేదవాడికి ఇల్లు రాకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. పేదల వ్యతిరేకులంతా 18 కేసులు వేశారని పేర్కొన్నారు. న్యాయపోరాటం చేసి పెత్తందారులపై పేదల ప్రభుత్వం విజయం సాధించిందని స్పష్టం చేశారు. పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తే రాజధాని అభివృద్ధి చెందదని కొందరు వాదించారని తెలిపారు. రాజధానిలో పేదలు ఉండకూడదా? అని ప్రశ్నించారు. అమరావతిని సామాజిక అమరావతిగా మార్చడానికి పునాది రాయి వేశానన్నారు.
మరోవైపు సీఎం జగన్ పర్యటన సమయంలో అమరావతి రైతులు ఆందోళనకు దిగారు. ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణం పేరుతో పేదలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణాయపాలెంలో నల్ల జెండాలు, బెలూన్లు ప్రదర్శించి నిరసన చేపట్టారు. ఆర్-5 జోన్ అంశంపై హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉన్నా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టడంపై అభ్యంతరం తెలిపారు. కోర్టులంటే సీఎం జగన్కు పట్టింపు లేదని మండిపడ్డారు.
రాజధాని ప్రాంతంలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో జనసేన కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి ఆళ్ల హరిని అమరావతి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. జనసేన నేతలను అరెస్ట్ చేశారు. జనసేన నాయకులకు పోలీసులు ముందే నోటీసులు ఇచ్చారు. నిరసన కార్యక్రమాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు జనసేన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.