Cm Jagan: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని నిర్ణయించారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులను మార్చేశారు. వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తున్నామని స్పష్టం చేశారు. మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జిల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి రప్పించారు.
మంత్రులు పినిపే విశ్వరూప్, గుమ్మనూరు జయరాం వచ్చి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి , డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముఖ్యమంత్రిని కలిశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై చర్చించారు. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి తమ సీటుపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించారని సమాచారం.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ప్రసాదరాజు,కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య సీఎంవోకు వచ్చారు. మాజీ మంత్రి శంకరనారాయణ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్, కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా సీఎంవో కు వచ్చి పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు జరిపారు.
కొంత మంది నేతలకు సీఎం జగన్ సీటు ఇవ్వడం లేదని నేరుగా చెప్పారని తెలుస్తోంది. సోమవారం ఉభయగోదావరి జిల్లాల నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రెండు రోజుల్లో చాలా నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను ఖరారు చేస్తారని సమాచారం. వారి పేర్లను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.