Jagan : శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ రాజధానిపై మరోసారి కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. పరిపాలనా వికేంద్రీకరణే ప్రభుత్వ లక్ష్యమని తేల్చిచెప్పారు. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామని ప్రకటించారు. అప్పటి నుంచి తాను కూడా విశాఖలోనే ఉంటానని తెలిపారు.
రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ మాత్రమేనని స్పష్టం చేశారు.
పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటుందని చాలాకాలంగా సీఎం జగన్ చెబుతున్నారు. కానీ ఇంతవరకు అ దిశగా అడుగులు మాత్రం పడలేదు. ఈ ఏడాది ఉగాది నుంచి వైజాగ్ నుంచి పాలన కొనసాగించాలనుకున్నారు. అయితే అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో వెనక్కి తగ్గారు. రాజధానిపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే విశాఖకు పాలన తరలించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పడు విశాఖ రాజధానిపై కొత్త తేదీని సీఎం ప్రకటించారు.
మరోవైపు ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. తాను ఒక్కడినే ఒకవైపు ఉన్నానని.. మిగతా పార్టీలన్నీ కలిసి చీకటి యుద్దం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ యుద్ధంలో తన ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం ప్రజలేనని స్పష్టం చేశారు. దేవుని దయ.. ప్రజల చల్లని ఆశీస్సులే కోరుకుంటున్నానని అన్నారు. తోడేళ్లన్నీ ఏకమైనా తనకేమీ భయం లేదని జగన్ స్పష్టం చేశారు.
శ్రీకాకుళం పర్యటనలో మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, హిర మండలం వంశధార లిప్ట్ లిరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. మూలపేటలో గంగమ్మకు జగన్ ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రాన్ని మార్చివేస్తాయని తెలిపారు.