AP CM today news(Latest political news in Andhra Pradesh) : ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు 6 ఆహారశుద్ధి యూనిట్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. మరో 5 యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు. ఆర్బీకేలకు అనుబంధంగా నిర్మించిన 421 కలెక్షన్ సెంటర్లు, 43 కోల్డ్ రూమ్స్ను సీఎం రైతులకు అంకితం చేస్తారు. సీఎం జగన్ ప్రారంభించనున్న 6 యూనిట్లలో 4 టమాటా యూనిట్లు, ఒకటి మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్, మరొకటి ఉల్లి ఉత్పత్తుల పరిశ్రమ.
అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట మండలం తుమ్మగుంటపల్లి, చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండ, బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లి, సోమల మండలం కామిరెడ్డివారిపల్లెల్లో టమాటా యూనిట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ సామర్థ్యం ఏడాదికి 3,600 టన్నులు. విజయనగరంలో మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేశారు. ఏటా 7,600 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ లో బిస్కెట్లు, సేమ్యా, రాగిపిండి, మిల్లెట్ చిక్కీలు తయారు చేస్తారు. కర్నూలులో ఉల్లి ఉత్పత్తుల యూనిట్ నిర్మించారు. ఈ యూనిట్ కు ఏటా 6 వేల టన్నుల ఉల్లిని ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది.
మరో 5 ఆహారశుద్ధి పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ భూమిపూజ చేస్తారు. ఇందులో చాక్లెట్ల కంపెనీ, వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్, 3 టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. మాండలిజ్ చాక్లెట్ కంపెనీ రూ.1,600 కోట్లతో శ్రీసిటీలో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామం వద్ద వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ఏటా 55,620 టన్నుల వేరుశనగను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఈ యూనిట్ ఏర్పాటుకానుంది.
అనంతపురం జిల్లాలో కల్యాణదుర్గం, కుందుర్పి, సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిల్లో టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క యూనిట్ సామర్థ్యం ఏటా 3600 టన్నులు. ఉద్యానపంట ఉత్పత్తుల నిల్వ, గ్రేడింగ్ కోసం నిర్మించిన 421 కలెక్షన్ సెంటర్లు, 43 కోల్డ్ రూమ్స్ను సీఎం రైతులకు అంకితం చేస్తారు.