Jagan : అమరావతిలో 50,793 ఇళ్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. 45 మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేఅవుట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు కేటాయించారు. 25 లేఅవుట్లు రూపొందించారు. ఈ ఏడాది మే 26న సీఎం జగన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు.
ఇళ్ల నిర్మాణానికి రూ.1,371.41 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.384.42 కోట్లు వ్యయం చేస్తామని ప్రభుత్వం తెలిపింది. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్ గ్రంథాలయాలు, 12 హాస్పటల్స్ నిర్మాణాన్ని చేపడతారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.1.68 కోట్లతో 2 దశల్లో 28 వేల మొక్కలను నాటతారు.
ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం సమకూరుస్తుంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్ ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై అందిస్తుంది. ఇలా మరో రూ.40 వేల మేర లబ్ధి చేకూరుస్తుంది. లేఅవుట్లో తనకు కేటాయించిన స్థలంలో మోడల్ హౌస్ నిర్మించడం చాలా ఆనందంగా ఉందని కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి జీవరత్నం అన్నారు. స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి తన కలను సీఎం జగన్ సాకారం చేశారని ఆనందం వ్యక్తంచేశారు.
మరోవైపు సీఎం జగన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు జనసేన పిలుపునిచ్చింది. మరోసారి ప్రజలను మోసం చేయడానికి సీఎం వస్తున్నారంటూ చలో కృష్ణాయపాలెం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. శంకుస్థాపనలు తప్ప ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయని సీఎం జగన్ అంటూ జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.