CM Jagan: 175కి 175. ఒక్కసీటు కూడా తగ్గేదేలే. సీఎం జగన్ చాలా పట్టుదలతో ఉన్నారు. ఈసారి క్లీన్ స్వీప్ చేయాలని ఛాలెంజ్ గా తీసుకున్నారు. అందుకే, పదే పదే రివ్యూలు, మీటింగులతో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయనేది జగన్ అంచనా. అయితే, తానెంత సుపరిపాలన అందిస్తున్నా.. ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో లేకపోతే కష్టమే. అందుకే, “గడప గడపకు మన ప్రభుత్వం” పేరుతో ఎమ్మెల్యేలను ప్రజల చెంతకు పంపించారు సీఎం. ఆ కార్యక్రమంలో అనేక పదనిసలు. కొన్నిచోట్లు స్వాగతాలు, ఇంకొన్నిచోట్ల చీదరింపులు, నిలదీతలు. ఏది ఏమైనా ఆ ప్రోగ్రామ్ ను కొనసాగించాల్సిందేనని జగన్ డిసైడ్ అయ్యారు.
అయితే, “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం లైట్ తీసుకుంటున్నారని తెలిసింది. ప్రజల్లోకి వెళ్లకుండా, వారి సమస్యలు అడిగి తెలుసుకోకుండా, ప్రభుత్వ పథకాలను వారికి వివరించకుండా.. ప్రజలకు ముఖం చేటేస్తున్నారని కొందరి ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వచ్చాయి. నిఘా సంస్థల నివేదికలో, సర్వేలో 32 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని తేలింది.
దీంతో, సీఎం జగన్ ఆ 32 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
“గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మే 11న ప్రారంభించింది. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నియోజకవర్గ సమన్వయకర్త గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని.. వారి సమస్యలను పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ కార్యక్రమం అమలు తీరు ఎలా ఉందనేదానిపై ప్రతి 3 నెలలకోసారి సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. తాజా సర్వే నివేదికను సీఎం జగన్ శుక్రవారం వెల్లడించారు. 32 మంది ఎమ్మెల్యేలు వెనకబడినట్టు గుర్తించి.. తీరు మార్చుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చిలో మరోసారి గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహిస్తానని ఆలోగా లోటుపాట్లను కవర్ చేసుకోవాలని తేల్చి చెప్పారు సీఎం జగన్.