అల్లూరి సీతారామరాజు, ఏలూరులో జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించారు. కూనవరంలో వరద బాధితులను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు నిత్యవసరాలు అందించామని సీఎం తెలిపారు. ఇళ్లు దెబ్బతింటే రూ. 10 వేలు ఇవ్వాలని ఆదేశించామన్నారు. బాధితులందరికీ రూ.2 వేలు ఆర్థికసాయం చేశామని చెప్పారు. ఇంకా ఎవరికైనా వరద సాయం అందకపోతే తనకు చెప్పాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టును నిర్మించిన ఘనత తమకే దక్కాలని ఆరాటపడటం లేదని జగన్ స్పష్టం చేశారు. ప్రజలకు న్యాయం చేయడమే తన సంకల్పమన్నారు. పోలవరం నిర్వాసితుల పునరావాసం కోసం కేంద్రంతోపాటు రాష్ట్రం నిధులు ఇస్తుందని తెలిపారు. పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం తెలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం పరిహారం కేంద్రం స్వయంగా చెల్లించినా పర్వాలేదని పేర్కొన్నారు. నిర్వాసిత కుటుంబాలకు న్యాయంగా ప్యాకేజీ అందుతుందని భరోసా కల్పించారు.
మూడు దశల్లో పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతామని జగన్ తెలిపారు. ఒక్కసారిగా నింపితే డ్యామ్ కూలిపోవచ్చని తెలిపారు. సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతామని చెప్పారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు బుద్ధిలేకుండా వ్యవహరించారని మండిపడ్డారు.
మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలను స్వయంగా కలుస్తారు. నేరుగా వారితో మాట్లాడతారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరును బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకుంటారు.