ఏపీలో ఎన్నికల వ్యూహంతో వైసీపీ శిబిరంలో అలజడి మొదలైంది. పార్టీ నేతలకు గుబులు పట్టుకుంది. 175 సీట్లే టార్గెట్గా.. క్లీన్ స్వీప్ దిశగా జగన్ ఎత్తుగడలతో ఎవరి సీటుకి ఎసరుపడుతుందోననే ఆందోళనతో వైసీసీ నేతలు టెన్షన్లో పడ్డారు.
ఏపీలో ఎన్నికల కురుక్షేత్రం త్వరలో జరగనుండటంతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. మార్పులు చేర్పులతో జగన్ వ్యూహాలు రచిస్తుండటంతో వింటర్ సీజన్లోనూ వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయి. తెలంగాణ ఫలితాల తర్వాత జగన్ ఎన్నికల వ్యూహం మారుస్తున్నారు. సిట్టింగ్లను నమ్ముకుంటే కేసీఆర్లా నట్టేట మునగడం ఖాయమనుకున్నారో ఏమో నియోజకవర్గాల ఇన్చార్జ్లను మార్చే పనిలో పడ్డారు.
ఈ ఎత్తుగడలో భాగంగానే ఒక్కసారే 11 నియోజకవర్గాల ఇన్చార్జ్లను మార్చారు జగన్. ఇది మంగళగిరితోనే మొదలు పెట్టారు. ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయడంతో గంజి చిరంజీవిని ఆ నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమించారు. ఇదే విధానాన్ని అటు గాజువాకలోనూ అమలు చేశారు. తనకు టికెట్ దక్కే అవకాశం లేదని పసిగట్టిన గాజువాక ఇన్చార్జ్ దేవన్రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో వరికూటి రామచంద్రరావును ఇంచార్జ్ గా నియమించింది.
ఎన్నికల కదనరంగంలో గట్టి పోటీ వైసీపీ, ఉమ్మడి టీడీపీ, జనసేనల మధ్యే. దీంతో జనసేనాని గతంలో పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం, లోకేష్ బరిలో నిలిచిన మంగళగిరినే టార్గెట్ చేశారు జగన్. రెండు నియోజకవర్గాల్లోనూ వైసీపీదే హవా నడిచిన్పటికీ.. ఈ రెండు డివిజన్లలోనూ కొత్త ఇన్చార్జ్లను మార్చడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎమ్మెల్యేల పని తీరుపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత జగన్. ఈ మేరకు గత 6 నెలలుగా 6 సార్లు సర్వేలు నిర్వహించారు.
అయితే.. ప్రతీ సర్వేలో ఆళ్లకు 30 శాతం మాత్రమే ఫలితాలు రావడం.. లోకేష్కు 40 నుంచి 56 శాతం అనుకూలంగా ఉన్నట్టు ఫలితాలు రావడంతో ఆళ్లను పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు జగన్. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఆర్కే రాజీనామా చేసి తప్పుకున్నారు.
జగన్ ఎన్నికల వ్యూహంతో గాజువాకలోనూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తనకు టికెట్ దక్కదని భావించిన గాజువాక ఇన్చార్జ్ దేవన్రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇక్కడ యాదవ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించే అవకాశమున్నట్టు తెలియడంతో దేవన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఊహించినట్టుగా యాదవ సామాజిక వర్గం నుంచి వరికూటి రామచంద్రరావును ఇంచార్జ్గా నియమించిన వైసీపీ. అక్కడి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్రావును ఎదుర్కొనేందుకు జగన్ ఈ ఎత్తుగడ వేశారు.