Jagan: ఉదయం ఏపీ అసెంబ్లీలో రచ్చ రచ్చ జరిగింది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. సభలో ఘర్షణపై తీవ్ర దుమారం చెలరేగింది. టీడీపీ సభ్యులపై బహిష్కరణ వేటు పడింది.
మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ సభకు వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. దేశ చరిత్రలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కాం అతిపెద్దదని అన్నారు. 371 కోట్లను హారతి కర్పూరంలా మాయం చేశారని.. ఆ డబ్బులను షెల్ కంపెనీలతో చంద్రబాబు ఖాతాలోకి మళ్లించారని ఆరోపించారు. టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టకుండా సీమెన్స్కు ప్రాజెక్ట్ కట్టబెట్టారని.. లోపాయికారీ ఒప్పందంతో దోపిడీ చేశారని.. పక్కా స్కిల్డ్ క్రిమినల్ చేసిన బిగ్ స్కామ్ ఇదని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. దోచుకో, పంచుకో, తినుకో అన్నదే వారి విధానమని మండిపడ్డారు.
90 శాతం సీమెన్స్, 10 శాతం ప్రభుత్వం భరిస్తుందని అన్నారని.. సుమారు 3వేల కోట్లు సీమెన్స్ ఇస్తుందని ప్రచారం చేశారని గుర్తు చేశారు. కేబినెట్ నిర్ణయం, ఒప్పందానికి సంబంధం లేకుండా జీవో స్వరూపాన్ని మార్చేశారని జగన్ ఆరోపించారు. జీవో వేరు, ఒప్పందం వేరు.. మరి ఎలా సంతకాలు చేశారని ప్రశ్నించారు. 3 నెలల కాలంలోనే 371 కోట్లు విడుదల చేశారని.. చంద్రబాబు పాత్ర లేకుండా ఇంత పెద్ద స్కాం జరుగుతుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. డబ్బును గ్రాంట్గా ఇస్తే మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని.. కానీ ఒప్పందంలో ఎక్కడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే ప్రస్తావనే లేదని చెప్పారు. సీమెన్స్ సంస్థ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేసిందని.. ఈ వ్యవహారంతో తమకు సంబంధంలేదని కంపెనీ స్పష్టం చేసిందని అన్నారు. ఈ స్కాంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయన్నారు సీఎం జగన్.