Christmas : పులివెందులలో సీఎస్ఐ చర్చిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో వైఎస్ జగన్ తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు. సోమవారం ఉదయం ఇడుపులపాయ ఎస్టేట్ నుండి హెలికాప్టర్ ద్వారా బాకరపురం చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా పులివెందుల టౌన్ చేరుకున్నారు.
అనంతరం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో తన తల్లితో కలిసి సీఎం కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రజలందరికీ ముందస్తు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 2024 సంవత్సరం క్యాలెండర్ని విడుదల చేశారు. ప్రతి ఏడాది క్రిస్మస్ పర్వదినం తన సొంత ఊరులో నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు. కుటుంబసభ్యులు, బంధువులతో, స్నేహితులతో జరుపుకోవడం మరింత సంతోషాన్నిచ్చిందని సీఎం జగన్ తెలిపారు.
రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకే ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో ఉన్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరి హృదయాల్లొ ప్రియమైన నాయకుడిగా అందరి మన్నలను పొందగలనని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ , వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, పలువురు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.