ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్కు చేరుకుంటారు. అనంతరం తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ సీఎం, కేసీఆర్ ను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ఆయన నివాసంలో కలిసి జగన్ పరామర్శిస్తారు. ఇక మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.
కాగా.. డిసెంబర్ 8న ఫామ్హౌస్లో జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. 15న చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ మంత్రులు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నాయకులు.. బీఆర్ఎస్ నేతలు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సీఎం జగన్ కూడా గత నెలలోనే కేసీఆర్ ను పరామర్శించాల్సి ఉంది. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా జగన్ కలవలేకపోయారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అయితే నేడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఢిల్లీ వెళ్ళిన తరుణంలో.. సీఎం జగన్.. కేసీఆర్ ని కలుస్తుండడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు షర్మిల – జగన్ మధ్య ఉన్న విభేదాలు గురించి బయటపడుతున్న క్రమంలో నిన్న జగన్ ను కలిసి పెళ్లి కార్డు ఇవ్వడం.. చర్చనీయాంశమైంది. షర్మిల కలిసి ఒక్క రోజు కూడా గడవకముందే కేసీఆర్ ని.. జగన్ కలుస్తుండడం ఈ విబేధాలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ బై బై చెప్పిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చెరతానని ఇప్పటికే ప్రకటించారు.