Jagan :వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఒబెరాయ్ సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను వీక్షించారు. తిరుపతి, విశాఖలోనూ ఒబెరాయ్ సెవెన్ స్టార్ హోటళ్లు నిర్మిస్తారు. ఈ హోటల్స్కు వర్చువల్గా సీఎం శంకుస్థాపన చేశారు. ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఒబెరాయ్ హోటల్స్ ఎండీ విక్రమ్ సింగ్ ఒబెరాయ్, మంత్రులు అంజాద్ బాషా, ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్ , ఎంపీ అవినాష్రెడ్డి పాల్గొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం గండికోట అని సీఎం జగన్ అన్నారు. ఏపీలో ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ పెట్టుబడులు పెట్టడం శుభపరిణామంగా పేర్కొన్నారు. గండికోటలో టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. ఒబెరాయ్ సెవెన్ స్టార్స్ హోటల్స్ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయమని తెలిపారు. గండికోటకు మరో స్టార్ గ్రూప్ను కూడా తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఏడాది మార్చి మొదటి వారంలో విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహించింది. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం , ఒబెరాయ్ గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. 350 కోట్ల వ్యయంతో ఏడు స్టార్ హోటల్స్ ను నిర్మాణానికి ఒబెరాయ్ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఇప్పుడు హోటల్స్ నిర్మాణం చేపడుతోంది. తొలి దశలో మూడు సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.