ప్రాబ్లమ్స్..ప్రాబ్లమ్స్.. ఐ డోన్ట్ లైక్ ఇట్.. ఐ అవాయిడ్.. బట్ ప్రాబ్లమ్స్ లైక్స్ మీ. ప్రస్తుతం ఈ డైలాగ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ కి బాగా సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఒకవైపు ప్రతిపక్షాల పోరు.. మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి సెగలు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల కోసం అభ్యర్ధులను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు సీఎం జగన్. వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ తో ఎన్నిక రెడీ అవుతున్న వైసీపీ.. ఏ ముహూర్తాన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిందో అప్పటి నుంచి పార్టీకి కష్టాలు మొదలయ్యాయి.
తాడేపల్లి లోని వైసీపీ కార్యాలయం రోజూ ఆందోళన లతో అట్టుడుగుతుంది. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. మిగతా నియోజకవర్గాల పై కూడా ఫోకస్ పెట్టింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు వద్దంటూ పార్టీ కార్యకర్తలు ఆందోళన బాట పడుతున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వద్దంటూ.. కార్యకర్తలు, పార్టీ నేతలు నిరసన తెలుపుతున్నారు. అలానే చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకి మరోసారి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ గందరగోళంలో ఉన్న వైసీపీకి అసంతృప్తి ఎమ్మెల్యేలు పూటకో మాట మాట్లాడుతుండడం తల నొప్పిగా మారింది.
ఈ క్రమంలోనే సెకండ్ లిస్ట్ ని రిలీజ్ చేసేందుకు సీఎం జగన్ సిద్ధం అయినట్లు సమాచారం అందుతుంది. సెకండ్ లిస్టు కింద 11 మంది అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ లిస్ట్ లో తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల నుంచి ఉండనుందని భావిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పు ఉండనుందని అంటున్నారు. జిల్లాలోని పిఠాపురం, పి.గన్నవరం, అమలాపురం, రామచంద్రాపురం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, జగ్గంపేట.. స్థానాల్లో అభ్యర్ధులను మార్చనున్నారని ప్రచారం జరుగుతుంది.
అలానే ఉమ్మడి అనంతపురంలోని 14 నియోజకవర్గాలకు గాను.. నాలుగు చోట్ల అభ్యర్థులు మార్పు ఉందంటున్నారు. జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, పెనుగొండ, సింగనమల.. స్థానాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. లిస్ట్ రెడీ అయ్యిందని.. రేపో మాపో లిస్ట్ వస్తుందనే చర్చ సాగుతోంది. లిస్టు విడుదలైన తర్వాత ఏ నేత ఉంటారు ఏ నేత వెళతారని పార్టీ అధిష్టానం అంచనా వేసుకుంటున్నట్లు సమాచారం. నేతల రియాక్షన్స్ బట్టి మూడో లిస్ట్ రిలీజ్ చేయనున్నారు. ఇక మూడో లిస్ట్ కింద 35 మంది అభ్యర్థుల లిస్టు ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు ఊహిస్తున్నారు.
అయితే ఇప్పటికే ఎమ్మెల్యే ఆర్కే పార్టీకి రాజీనామా చేయగా.. రాజకీయాలకు దూరంగా ఉంటామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించారు. అదే విధంగా అధిష్టానంపై అసహనం వ్యక్తం చేస్తూ పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యలు చేయడం కూడా సంచలనంగా మారింది. దీంతో నేతలను బుజ్జగించే పనిని రీజినల్ కోఆర్డినేటర్లకు.. సీఎం జగన్ అప్పగించినట్లు తెలుస్తుంది.