Ramachandrapuram : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేక ఉంది. ఇక్కడ ఓటర్లు తీర్పు విభిన్నంగా ఉంటుంది. ఇప్పుడు అధికారపార్టీలోని ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఆ ఇద్దరు నేతలకు ప్రత్యర్థిగా ఉన్న నాయకుడు కూడా ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు రామచంద్రపురం పంచాయితీపై ఆ నేతకు పిలుపు రావడం ఆసక్తిగా మారింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మధ్య వార్ నడుస్తోంది. రామచంద్రపురం టిక్కెట్ వేణుకి ఇస్తే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి వేణు ఆచితూచి స్పందించినా చెప్పాల్సిన విషయం చెప్పేశారు. బోస్ ను తనకు రాజకీయ గురువుగా పేర్కొన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం టిక్కెట్ తనకే దక్కుతుందని స్పష్టం చేశారు.
రామచంద్రపురం పంచాయితీపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఎంపీ పిల్లి సుభాష్, మంత్రి వేణుగోపాలకృష్ణ మధ్య వివాదానికి ముగింపు పలకాలని భావిస్తోంది. దీంతో ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. తోటకు రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి ఫోన్ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయనికి రావాలని కోరారు. ఇప్పుడు ఈ అంశమే ఆసక్తిగా మారింది.
1994 నుంచి 2014 వరకు రామచంద్రపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు ప్రత్యర్థులుగా ఉన్నారు. 1994లో త్రిమూర్తులు ఇండిపెండెంట్ గా గెలిచారు. ఆ ఎన్నికల్లో బోస్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 1999లో పిల్లి బోస్ పై టీడీపీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు గెలిచారు. 2004లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బోస్.. తోటను ఓడించారు. 2009లో ప్రజారాజ్యం నుంచి త్రిమూర్తులు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బోస్ చేతిలో ఓటమి చవిచూశారు. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత 2012లో జరిగిన ఉపఎన్నికల్లో తోట త్రిమూర్తులు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. ఆ ఉపఎన్నికలో బోస్ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. 2014లో తిరిగి టీడీపీలో చేరిన తోట త్రిమూర్తులు మళ్లీ బోస్ ను ఓడించారు.
ఈ ఇద్దరు నేతలు 6సార్లు ముఖాముఖిగా తలపడ్డారు. అందులో నాలుగు సార్లు తోట త్రిమూర్తులు గెలిచి పైచేయి సాధించారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో రామచంద్రపురం టిక్కెట్ బోస్ కు దక్కలేదు. ఇక్కడ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి తోటను ఓడించారు. ఆ తర్వాత త్రిమూర్తులు కూడా వైసీపీలో చేరిపోయారు. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే 2019 ఎన్నికల్లో మండపేట నుంచి పిల్లి బోస్ పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఇప్పుడు మండపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా తోట త్రిమూర్తులు ఉన్నారు. మండపేట టిక్కెట్ తోటకు సీఎం జగన్ ఇప్పటికే కన్ఫామ్ చేశారు. ఇలా ఒకవైపు తన చిరకాల ప్రత్యర్థి త్రిమూర్తులు, మరోవైపు శిష్యుడు చెల్లుబోయిన వేణుతో బోస్ కు చెక్ పడింది.
2019 ఎన్నికల్లో ఓడినా ఎమ్మెల్సీగా ఉన్న బోస్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు సీఎం జగన్. శాసన మండలి రద్దు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి బోస్ ను రాజ్యసభకు పంపించారు. బోస్ రాజీనామాతో ఖాళీ అయిన మంత్రి పదవిని వేణుకి ఇచ్చారు. ఇలా అనేక అంశాలు పిల్లి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తికి కారణంగా ఉన్నాయి. అందుకే తన కుమారుడు సూర్యప్రకాష్ రాజకీయ భవిష్యత్తు కోసం బోస్ వైసీపీ అధిష్టానాన్ని ధిక్కరించేందుకు సిద్ధమయ్యారు.