ఎన్నికల ఫలితాలపై వైసీసీ మైండ్ గేమ్ ఆడుతుందా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు టీడీపీ నేతలు. ఫ్యాన్ పార్టీ నేతలు ఆడుతున్న మైండ్ గేమ్ చేస్తుంటే నవ్వు వస్తుందన్నారు రఘురామకృష్ణరాజు, గంటా, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయా నేతలు.. ఓటమి భయంతోనే వైసీపీ దాడులు చేయిస్తోందన్నారు.
జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారమంటూ వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. వైవీ సుబ్బారెడ్డి, బొత్స ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు. ప్రమాణ స్వీకారానికి స్టేడియం ఏర్పాట్లు, స్టార్ హోటల్స్ బుక్ చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ సినిమా అయిపోయిందని, నాలుగుతో దుకాణం క్లోజ్ అవుతుందన్నారు గంటా శ్రీనివాసరావు.
ఐప్యాక్ టీమ్ వచ్చి సీఎం జగన్కు ఎన్ని సీట్లు వస్తాయని చెబుతారని, అలాంటిది ఆయన అక్కడికి వెళ్లి అన్ని సీట్లు చెప్పడం మరీ దారుణంగా ఉందన్నారు సోమిరెడ్డి. మాచర్ల, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఓటు ద్వారా ప్రజలు బుద్ది చెబుతారన్నారు. జగన్ ప్రభుత్వంలో అసెంబ్లీకి విలువ లేదని, ఐపీఎస్, ఐఏఎస్లు నలిగిపోయారన్నారు.
ALSO READ: వైసీపీ అరాచకం, అడ్డంగా దొరికిన పిన్నెల్లి, డీజీపీకి ఈసీ సమాచారం
ఉద్యోగస్తులు ఎప్పుడైనా తిరగబడితే ఆ ఎన్నికల్లో అధికార ప్రభుత్వం విజయం సాధించిన సందర్భాలు లేవన్నారు రఘురామకృష్ణరాజు. జగన్ చాప్టర్ క్లోజ్ అయ్యిందన్నారు. కూటమి 125 సీట్లలో తప్పకుండా విజయం సాధించడం ఖాయమన్నారు. పిన్నెల్లి విధ్వంసం కళ్లకు కట్టినట్టు మీడియా చూపించిందని, ఆయన మంచి సౌమ్యుడంటూ సీఎం జగన్ చెప్పడాన్ని తనదైనశైలిలో వ్యాఖ్యానించారాయన.
అంతకుమందు విజయనగరం వచ్చిన రఘురామకృష్ణరాజు పైడి అమ్మవారిని సందర్శించుకున్నారు. అటు విశాఖ వెళ్లి టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో ముచ్చటించారు.