CM Chandrababu with flood victims and farmers: ప్రకాశం బ్యారేజీని కూల్చేందుకు వైసీపీ కుట్ర చేసిందని , అందుకే బోట్లు వదిలారని సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఏలూరు జిల్లాలో వరద బాధితులు, రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ పాలకుల పాపాలు.. మనపాలిట శాపాలుగా మారాయన్నారు.
ప్రకాశం బ్యారేజీ కూల్చేందుకు వైసీపీ నాయకులు బోట్లు వదిలి పెను ప్రమాదం చేసేందుకు ప్రయత్నించారన్నారు. 50 టన్నుల బరువు ఉన్న బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయన్నారు. ఒకవేళ ప్రకాశం బ్యారేజీ కూలిపోయినట్లయితే లంక గ్రామాల పరిస్థితి ఎలా ఉండేదోనని ఆందోళన చెందారు. ఆ బోట్లతోనే గతంలో అక్రమ ఇసుక వ్యాపారం చేశారన్నారు.
వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్లు వస్తున్నాయని, వరదల సమయంలో వైసీపీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. గతంలో బుడమేరు గండ్లు పూడ్చకపోవడం వల్లే విజయవాడకు ఈ పరిస్థితి వచ్చిందని, గత ప్రభుత్వం బుడమేరులో పూడిక తీయలేదని గండ్లు పూడ్చలేదని ఆరోపించారు.
అంతకుముందు, ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.