Chandrababu strong warning to Jagan: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించబోమంటూ తేల్చిచెప్పారు. అసెంబ్లీ కమిటీ హాలులో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో సీఎం మాట్లాడారు. సుమారుగా గంటన్నరపాటు ఈ సమావేశం కొనసాగింది. ఇసుక, శాంతి భద్రతలపై భేటీలో ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘అక్రమ కేసులు ఎదుర్కొని 53 రోజులు జైలులో ఉన్నాను. కక్ష సాధింపు చర్యలకు దిగాలంటే ముందుండాల్సింది నేనే.. కానీ, ప్రజలు మనల్ని అందుకోసం గెలిపించలేదనే విషయాన్ని ప్రతి ఒక్క నేత గుర్తుపెట్టుకోవాలి. శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం. తప్పు చేసినవారిని శిక్షిస్తాం. వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే జగన్ మళ్లీ మొదలుపెట్టాడు. వినుకొండ వ్యవహారంలోనూ అదే కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు.. అప్పుడే విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని మొదటిరోజే అడ్డుకోవడం సరైన విధానం కాదు. తప్పులు చేయడం.. ఆ తప్పులను పక్కవారిపైకి నెట్టేయడం జగన్ మోహన్ రెడ్డికి అలవాటైపోయింది. వివేకా హత్య విషయంలోనూ ఇతరులపైకి నెపం నెట్టేసే ప్రయత్నం చేశారు’ అంటూ జగన్పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
Also Read: నల్ల కండువా ధరించి అసెంబ్లీకి జగన్, పోలీసు అధికారికి వార్నింగ్
మరోవైపు ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ఇసుక జోలికి వెళ్లొద్దని చెప్పారు. ఇసుక ధరల విషయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందిస్తూ.. ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేద్దామన్నారు. ఉచిత ఇసుక విధానంపై మరిన్ని సూచనలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. డబ్బులు లేవని పనులను ఆపలేమని.. ఇబ్బందులు ఉన్నా ముందుకెళ్లాలన్నారు. ముందుగా రోడ్లపై పడిన గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సీఎం చెప్పారు. మూడు పార్టీల మధ్య సమన్వయానికి సంబంధించిన అంశాన్ని మంత్రి నాదెండ్ల ప్రస్తావించారు. ఈ విషయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి తనతోపాటు జనసేన ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా తొలిరోజు అసెంబ్లీలో జగన్ ప్రవర్తన సరిగా లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు.