Kakani Govardhan Reddy: ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో అన్నీ అసత్యాలే ఉన్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ అధినేత జగన్పై ఆరోపణలు చేసేందుకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. మంగళవారం సీఎం చంద్రబాబు విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంపై కాకాణి స్పందించారు. ఈ నేపథ్యంలోనే సీఎంపై విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు పాలనలోనే విద్యుత్ రంగం కుదేలయిందని విమర్శించారు. బాబు అధికారం కోల్పోయిన నాటికి విద్యుత్ రంగంలో రూ. 86,215 కోట్ల అప్పు ఉందని అన్నారు. 2014-19 వరకు సగటు వృద్ధి రేటు కేవలం 1.9 శాతం మాత్రమేనని అన్నారు. జగన్ హయాంలో 4.7 శాతం వృద్ధి రేటు సాధించిందని, జాతీయ సగటు కంటే ఇది అధికం అని తెలిపారు. గతంలో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. అంతటా సోలార్ విద్యుత్ ధరలు తగ్గితే రాష్ట్రంలో మాత్రం యూనిట్ను ఏడు రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల విద్యుత్ రంగానికి ఎంతో నష్టం జరిగిందన్నారు.
రైతలకు సబ్సిడీ బకాయిలు చెల్లించకపోవడంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని చెల్లించామని స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. ట్రూ అప్ ఛార్జీలు చంద్రబాబు హయాంలోనే వచ్చాయని విమర్శించారు. శ్వేతపత్రం విద్యుత్ రంగంలో ఉన్న పరిస్థితిని వివరించాలి కానీ సాంప్రదాయానికి తిలోదకాలిస్తూ సీఎం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారని మండిపడ్డారు విద్యుత్ ఉత్పత్తిని బ్రహ్మాండంగా పెంచామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు.
వైయస్ జగన్ హయాంలో విద్యుత్ రంగంలో వృద్ధి రేటు బాగా నమోదైందని అన్నారు. జాతీయ సగటు కంటే అత్యధికం అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చంద్రబాబు ప్రస్తావించలేదని ఆరోపించారు. చంద్రబాబు అన్ని అబద్ధాలే చెప్పారన్నారు. విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చింది చంద్రబాబే అని ఆరోపించారు. చంద్రబాబు పరిపాలనలోనే చాలా అప్పులు చేశారని మండిపడ్డారు. బాబు హయాంలో డిస్కంలు కూడా కుప్పకూలాయిని అన్నారు. విద్యుత్ రంగంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రం అబద్ధాలమయం అని ఆరోపించారు.
Also Read: విద్యుత్ రంగాన్ని నాశనం చేశారు: సీఎం చంద్రబాబు
శ్వేత పత్రం విడుదలలో జగన్ను విమర్శించేందుకే ఎక్కువ సమయం కేటాయించారని ఆరోపించారు. చంద్రబాబు రైతులకు సంబంధించి సబ్సిడీ బకాయిలను కూడా చెల్లించలేదని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని చెల్లించారని స్పష్టం చేశారు. దీంతో వినియోగదారులతో పాటు రైతులపై భారం పడకుండా చేశారన్నారు. ట్రూ అప్ ఛార్జీలు చంద్రబాబు హయాంలోనే వచ్చాయి.. కానీ తనకేమీ తెలియనట్టు చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు మీటర్లు.. ఉరితాళ్లు అన్న చంద్రబాబు ఇప్పుడైనా స్పందించాలని కాకాణి తెలిపారు.