CM Chandrababu Naidu: భారీ వర్షాలు, వరదల ధాటికి విజయవాడ అతలాకుతలం అవుతుంది. లక్షలాదిమంది ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యల్లో పాల్గొనడంలో కొందరు అలసత్వం వహించారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అలసత్వాన్ని వీడకుంటే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. అందరు అధికారులు ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొచ్చేలా పనిచేయాలని, స్వయంగా సీఎం రంగంలోకి దిగినా మొద్దునిద్ర వీడకుండా ఉంటే ఎలాగంటూ ఫైరయ్యారు.
బుడమేరు ముంపు ప్రాంతాల్లో వరద బాధితులకు ఆహారం పంపిణీలో ఉన్నతాధికారుల వల్ల జాప్యం జరిగిందని మంత్రి సీఎం దృష్టికి తీసుకురాగా.. వరద బాధితుల కోసం ఆహార పొట్లాట్ల కిట్లు తెప్పించినా వాటిని పంపిణీ చేయడంలో ఆలస్యం జరుగుతుండటంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే అధికారులు అలా వ్యవహరిస్తుండటాన్ని సహించేది లేదని హెచ్చరించారు. వీఆర్ లో ఉన్న కొందరు అధికారుల పనితీరుపై మంత్రి వివరించారు. కొల్లు రఘురామిరెడ్డి, విజయారావు, రఘువీరారెడ్డి, శ్రీకాంత్, సత్యానంద్, గోపాలకృష్ణ వంటి అధికారులకు డ్యూటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతాల్లో ఆహారం పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుందో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.
Also Read: ముంపు ప్రాంతాల్లో జేసీబీపై పర్యటించిన చంద్రబాబు.. నేనున్నానంటూ బాధితులకు భరోసా
అధికారులకు పనిచేయడం ఇష్టంలేకపోతే ఉద్యోగాలను వదిలేసి ఇంటికి వెళ్లిపోవచ్చన్నారు సీఎం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలాంటి సాకులు చెప్పినా సహించేది లేదని హెచ్చరించారు. సాయంత్రంలోగా మరో 3 లక్షల ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ తెప్పించాలని ఆదేశించారు. అలాగే వాటిని పర్యవేక్షించాలని సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించారు.
కాగా.. ఇప్పటివరకూ విజయవాడ, పరిసర ప్రాంతాలను చుట్టుముట్టిన వరద.. ఇప్పుడు రేపల్లెకు చేరింది. రావి అనంతారం వద్ద కృష్ణా కరకట్ట తెగడంతో.. రేపల్లె పట్టణవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇసుకకట్టలతో కట్టకు అడ్డుకట్టవేసినా నీరు పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.