CM Chandrababu Serious on Madanapalle Sub Collectorate Fire Accident : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఘటనా ప్రాంతానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు తక్షణమే హెలికాఫ్టర్ లో వెళ్లి.. పర్యవేక్షించాలని ఆదేశించారు. కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే అగ్నిప్రమాదం జరిగి కీలక ఫైళ్లు దగ్ధమవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్హా హాజరయ్యారు. సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్ధమైనట్లు సమాచారం ఉందని సీఎంకు తెలిపారు. సీసీ ఫుటేజీతో సహా.. వివరాలన్నింటినీ బయటకు తీయాలని వారికి ఆదేశాలిచ్చారు. ఆదివారం రాత్రి 11.24 గంటలకు ప్రమాదం జరిగినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ సీఎం కు ఫోన్ లో తెలిపారు.
Also Read : అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం, జగన్తో రఘురామ మాటలు, ఆయన పక్కనే..
అయితే.. అర్థరాత్రి వరకూ సబ్ కలెక్టరేట్ లో గౌతమ్ అనే ఉద్యోగి ఎందుకు ఉన్నాడో తెలుసుకుని చెప్పాలని అధికారులను ఆదేశించారు. ఆ ఉద్యోగి అక్కడికి ఎందుకు వెళ్లాడు అన్న వివరాలను పూర్తి తెలుసుకోవాలన్నారు. ఘటనా స్థలానికి పోలీసు జాగిలాలు వెళ్లాయా ? ఫోరెన్సిక్, ఇతర ఆధారాలను సేకరించడంలో ఎందుకు జాప్యం ? ఘటన జరిగిన వెంటనే మిగతా అధికారులు ఎందుకు వెంటనే స్పందించలేదు ? అన్న ప్రశ్నలు వేశారు. వాటన్నింటికీ సమాధానాలు కావాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై వీలైనంత త్వరగా సమగ్ర వివరాలు తన ముందుంచాలని తెలిపారు.
నిన్న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామాగ్రి అంతా అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వగా.. హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ మంటల్లో విలువైన రెవెన్యూ రికార్డులు దగ్ధమైనట్లు తెలుస్తోంది. రాత్రి 12 గంటల వరకూ కార్యాలయంలో ఉన్న గౌతమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ దీనిపై విచారణ చేపట్టారు.